
హైదరాబాద్, సాక్షి: ఫార్ములా ఈ కార్ రేసు కేసులో శరవేగంగా పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. కేటీఆర్ క్వాష్పై హైకోర్టు తీర్పు వెలువడిన వెంటనే ఏసీబీ దూకుడు ప్రదర్శించింది. ఈ కేసులో కీలకంగా ఉన్న గ్రీన్కో, దాని అనుబంధ సంస్థల్లో తనిఖీలు నిర్వహించింది. అదే సమయంలో ఈ కేసులో నిందితుల ఇళ్లపై సోదాలకు కోర్టు నుంచి సెర్చ్ వారెంట్(Search Warrant) తెచ్చుకుంది.
ఏ1గా కేటీఆర్, ఏ2గా ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, ఏ3గా హెచ్ఎండీఏ చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డి ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా.. కోర్టు అనుమతితో ఏ క్షణమైనా వీళ్ల నివాసాల్లో తనిఖీలు నిర్వహించే అవకాశం కనిపిస్తోంది. గ్రీన్ కో కంపెనీ ద్వారా జరిగిన ఒప్పందం, లావాదేవీలపై వాళ్లను విచారించే అవకాశం కనిపిస్తోంది. అలాగే.. హెచ్ఎండీ ద్వారా రేసు కోసం జరిగిన ఒప్పంద పత్రాలను సేకరించే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు.. ఫార్ములా ఈ కార్ రేసు(Formula E Car Race Case) కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ పంచాయితీ సుప్రీం కోర్టుకు చేరింది.
తెెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టులో కేవియట్ పిటిషన్ను దాఖలు చేసింది. ఫాార్ములా ఈ కార్ రేసు కేసులో కేటీఆర్ గనుక సుప్రీం కోర్టును ఆశ్రయిస్తే.. తమ వాదనలు సైతం వినాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ఇక.. హైకోర్టులో చుక్కెదురు కావడంతో సుప్రీం కోర్టుకు వెళ్లే యోచనలో కేటీఆర్ ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే బీఆర్ఎస్ లీగల్ టీం, బీఆర్ఎస్(BRS Party) కీలక నేతలతో ఆయన సంప్రదింపులు జరిపారు. హైకోర్టు తీర్పు కాపీ అందిన వెంటనే ఆయన సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ వేసే అవకాశం ఉంది.
