
సప్త మాత్రికలకు సమర్పించనున్న బంగారు బోనం
చార్మినార్: రాబోయే ఆషాఢ మాసం బోనాల జాతర ఉత్సవాలను పురస్కరించుకుని ఈ ఏడాది కూడా సప్త మాతృకల సప్త బంగారు బోనం కార్యక్రమంలో భాగంగా నగరంలోని ఏడు అమ్మవారి దేవాలయాలకు ఏడు బంగారు బోనాలతో పాటు పట్టు వస్త్రాలను సమర్పించనున్నట్లు భాగ్యనగర్ శ్రీ మహంకాళి జాతర బోనాల ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ అధ్యక్షులు బత్తుల బల్వంత్ యాదవ్ తెలిపారు. కమిటీ ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమం జూలై 11న గోల్కొండ జగదాంబ అమ్మవారికి జరిగే మొదటి బంగారు బోనంతో ప్రారంభమవుతుందన్నారు.
జూలై 13న బల్కంపేట ఎల్లమ్మ తల్లి, 16న జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి, 18న విజయవాడ కనకదుర్గమ్మ, 22న సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి, 27న చార్మినార్లోని భాగ్యలక్ష్మి అమ్మవారికి బంగారు బోనం, పట్టు వస్త్రాలను సమర్పిస్తామన్నారు. 29న లాల్దర్వాజ సింహవాహిణి అమ్మవారికి చివరి బోనం సమర్పణతో ఈ కార్యక్రమం ముగుస్తుందన్నారు.