
పార్టీలోకి ఆహ్వానిస్తున్న మంత్రి శ్రీనివాస్గౌడ్
జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్)/గన్ఫౌండ్రీ: ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో చోటుచేసుకున్న ఘటనపై కొందరు కక్కుర్తి రాజకీయాలు చేస్తున్నారని ఎక్సైజ్, క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ మండిపడ్డారు. బీసీలు రాజకీయంగా ఎదిగితే ఓర్వలేని కొన్ని రాజకీయ పార్టీలు అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఆదివారం రవీంద్రభారతిలో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో తొలి బహుజన చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ మహారాజ్ 372వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.
మంత్రి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడిన తర్వాత బీసీ కులాలకు ఆత్మగౌరవ భవనాలతో పాటు విలువైన స్థలాలను కేటాయించినట్లు తెలిపారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం బీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరి గౌరీశంకర్ తదితరులు పాల్గొన్నారు. కాగా, ఆదివారం మహబూబ్నగర్లోని టీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో బీజేపీకి చెందిన పలువురు కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ స్వాతంత్య్ర వజ్రోత్సవాల్లో భాగంగా జరిగిన ఫ్రీడం రన్ను ప్రారంభించేందుకు చేసిన ఫైరింగ్ను అనవసర వివాదం చేస్తున్నారని ఆరోపించారు. అనంతరం వివిధ పార్టీల నేతలు టీఆర్ఎస్లో చేరారు. కర్వెన, ఉదండాపూర్ రిజర్వాయర్లు సాధ్యమైనంత త్వరగా పూర్తిచేసి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తామని ఆయన తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment