
రాష్ట్రంలో 17 ఎంపీ స్థానాలకు, కంటోన్మెంట్ అసెంబ్లీకి జరగనున్న ఎన్నికలు
ఏపీలో 175 అసెంబ్లీ, 25 లోక్సభ సీట్లకు కూడా..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల సమరం ఊపందుకోనుంది. తెలంగాణలోని 17 ఎంపీ స్థానాలతో పాటు ఏపీలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు, 25 లోక్సభ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం గురువారం నోటిఫికేషన్(4వ విడత) జారీ చేయనుంది. రాష్ట్రంలో 12 జనరల్, 3 ఎస్సీ, 2 ఎస్టీ రిజర్వుడు లోక్సభ సీట్లకు నోటిఫికేషన్తో పాటు ఇటీవల ఖాళీ అయిన కంటోన్మెంట్ అసెంబ్లీ (ఎస్సీ రిజర్వుడు) స్థానానికి ఉప ఎన్నికల నోటిఫికేషన్ కూడా జారీ కానుంది.
రాష్ట్రంలో 3.3 కోట్ల ఓటర్లు
సాధారణ ఎన్నికల్లో రాష్ట్రంలోని 3,30,13,318 మంది ఓటర్లు ఓటు హక్కువినియోగించుకోనున్నారు. 1,64,14,693 మంది పురుషులు, 1,65,95,896 మంది మహిళలు, 2,729 మంది ట్రాన్స్జెండర్లు వీరిలో ఉన్నారు. ఈ నెల 15 వరకు కొత్త ఓటర్ల నమోదుకు దరఖాస్తులు స్వీకరించారు.వీరిలో అర్హులైన వారికి ఎన్నికల్లో ఓటు హక్కు కల్పించనున్నారు. రాష్ట్రంలో సర్వీసు ఓటర్లు 15,472 మంది, 18–19 ఏళ్ల యువ ఓటర్లు 8,72,116 మంది, 85 ఏళ్లు ఆపై వయస్సు ఓటర్లు 1,93,489 మంది, దివ్యాంగ ఓటర్లు 5,26,286 మంది, ప్రవాస ఓటర్లు 3,409 మంది ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment