
కుత్బుల్లాపూర్: రెవెన్యూ శాఖ పరిపాలనలో కీలకమని, ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించడానికి రెవెన్యూ ఉద్యోగులు శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్న తీరు అభినందనీయమని రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అన్నారు. మంగళవారం కొంపల్లిలో తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్విసెస్ అసోసియేషన్ (ట్రెసా) రాష్ట్ర అధ్యక్షుడు వంగ రవీందర్రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కృతజ్ఞత సభకు మంత్రి హాజరయ్యారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ, రెవెన్యూ సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని, గత ప్రభుత్వం ఆ శాఖను నిర్విర్యం చేసిందని, భూరికార్డులను ధరణి పేరుతో అస్తవ్యస్తంగా నిర్వహించడంతో రైతులకు తీవ్ర అన్యాయం జరిగిందని చెప్పారు. తమ ప్రభుత్వ హయాంలో రెవెన్యూ శాఖను పటిష్టపరిచి రైతులకు న్యాయం చేస్తామని, రెవెన్యూ ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
అనంతరం రవీందర్రెడ్డి మాట్లాడారు. ట్రెసా ప్రధాన కార్యదర్శి గౌతమ్ కుమార్ మాట్లాడుతూ గ్రామ రెవెన్యూ స్థాయిలో సేవలకు ఆటంకం కలగకుండా క్షేత్రస్థాయిలో సిబ్బందిని నియమించాలని కోరారు. కార్యక్రమానికి సుమారు 5వేలకు పైగా రెవెన్యూ ఉద్యోగులు తరలిరావడంతో సభా ప్రాంగణం కిక్కిరిసిపోయింది.
Comments
Please login to add a commentAdd a comment