ఏపీపీ పోస్టులకు నోటిఫికేషన్‌ | Telangana Assistant Public Prosecutor Notification 2021 | Sakshi
Sakshi News home page

ఏపీపీ పోస్టులకు నోటిఫికేషన్‌

Published Mon, Jul 5 2021 5:14 AM | Last Updated on Mon, Jul 5 2021 7:36 AM

Telangana Assistant Public Prosecutor Notification 2021 - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న అసిస్టెంట్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్ల (ఏపీపీ)ల నియామకానికి నోటిఫికేషన్‌  వచ్చింది. ఆదివారం ఉదయం వివిధ న్యాయస్థానాల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్ల పోస్టుల భర్తీకి రాష్ట్ర స్థాయి పోలీసు రిక్రూట్‌మెంట్‌ బోర్డు (టీఎస్‌ఎల్‌ పీఆర్‌బీ) చైర్మన్‌  వీవీ శ్రీనివాస రావు నోటిఫికేషన్‌  విడుదల చేశారు. అర్హతలు గలిగిన అభ్యర్థులంతా దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. కొత్త జోనల్‌ వ్యవస్థకు కేంద్రం ఆమోదం తెలిపిన తరువాత ప్రభుత్వం వెలువరించిన తొలి నోటిఫికేషన్‌  ఇదే కావడం గమనార్హం. ఏపీపీల రిక్రూట్‌మెంట్‌ను పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు చేపడుతుందని ‘సాక్షి’ (ఆదివారం నాటి సంచికలో) ముందే తెలిపిన సంగతి తెలిసిందే. అలాగే ఏ క్షణంలోనైనా పోలీసుశాఖలోని దాదాపు 19వేల పైచిలుకు పోస్టుల ఖాళీలకు రిక్రూట్‌మెంట్‌ బోర్డు నోటిఫికేషన్‌  ఇవ్వనుంది.  

ఏపీపీ పోస్టుల వివరాలు ఇలా... 
8 మొత్తం పోస్టులు: 151 
వేతనం: రూ.54,220–రూ.1,33,630. 
వయోపరిమితి: 2021, జూలై 1 నాటికి 34 ఏళ్లు దాటకూడదు.  
కనీస విద్యార్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎల్‌ఎల్‌బీ/ బీఎల్‌ లేదా ఇంటర్‌ తరువాత ఐదేళ్ల లా కోర్సు పూర్తిచేసి ఉండాలి. 
అనుభవం: జూలై 4 నాటికి కనీసం మూడేళ్లపాటు క్రియాశీలకంగా క్రిమినల్‌ కోర్టుల్లో అడ్వోకేటుగా పనిచేసి ఉండాలి. 
ఫీజు: తెలంగాణ స్థానికత కలిగిన ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు రూ.750. మిగిలిన అభ్యర్థులు (ఓసీ/బీసీ) అంతా రూ.1500.  
అభ్యర్థుల దరఖాస్తు ప్రకియ ఆదివారం నుంచే మొదలవడం విశేషం. ఎంపిక, వయోపరిమితి ఇతర వివరాల కోసం  https://www.tslprb.in/లో సంప్రదించగలరు. 

కొత్త జోన్ల ఆధారంగా  కేటాయింపులు..  
ప్రస్తుతం వెలువడిన ఏపీపీ నోటిఫికేషన్‌ ను కొత్త జోనల్‌ వ్యవస్థకు అనుగుణంగా ప్రకటించడం గమనార్హం. మొత్తం 151 పోస్టుల్లో మల్టీజోన్‌  1 పరిధిలో 68 పోస్టులు ఉండగా, మల్టీజోన్‌ –2 పరిధిలో 83 పోస్టులు ఉన్నాయి. అన్ని పోస్టుల భర్తీలోనూ జనరల్, బీసీ, ఎస్సీ, ఎస్టీ, విమెన్‌  రిజర్వేషన్లతోపాటు, మెరిటోరియస్‌ స్పోర్ట్స్‌ పర్సన్, ఎకనమికల్లీ వీకర్‌ సెక్షన్, వికలాంగుల రిజర్వేషన్‌ లను పరిగణనలోకి తీసుకున్నారు. ఎస్సీ/ఎస్టీ/బీసీలకు ఐదేళ్ల వయోపరిమితి కల్పించారు. వికలాంగులకు గరిష్టంగా పదేళ్ల మినహాయింపు ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఐదేళ్లు (టీఎస్‌ఆర్టీసీ, కార్పొరేషన్లు, మున్సిపాలిటీ తదితరాలకు వర్తించదు) వయోపరిమితి, ఎక్స్‌ సర్వీస్‌మెన్‌  (మాజీ సైనికాధికారులు), ఎన్‌ సీసీలో సేవలందించిన వారికి వమోపరిమితిలో మూడేళ్లపాటు మినహాయింపు కల్పించారు.  
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement