ఆస్తులు విడుదల చేయాల్సిందే ఈడీ జప్తు సరికాదు | Telangana High Court Dismisses ED Appeals In VANPIC Quid Pro Quo Case | Sakshi
Sakshi News home page

ఆస్తులు విడుదల చేయాల్సిందే ఈడీ జప్తు సరికాదు

Jun 20 2026 1:06 AM | Updated on Jun 20 2026 5:34 AM

Telangana High Court Dismisses ED Appeals In VANPIC Quid Pro Quo Case

వాన్‌పిక్‌ ఆస్తులు విడుదల చేస్తూ అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌ ఇచ్చిన ఉత్తర్వులను సమర్ధించిన తెలంగాణ హైకోర్టు

నాటి ఉత్తర్వుల్లో జోక్యం చేసుకొనేలా కొత్త ఆధారాలు లేదా కారణాలను ఈడీ చూపించలేదని స్పష్టికరణ

తక్షణమే ఆ ఉత్తర్వులు యథాతథంగా అమలు చేయాలని ఆదేశం 

వాన్‌పిక్‌ కేసుల్లోని ఆస్తులను విడుదల చేయాలని 2019లో అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌ ఉత్తర్వులు 

దీన్ని సవాల్‌ చేస్తూ హైకోర్టులో పిటిషన్లు వేసిన ఈడీ

ఏడేళ్లపాటు అన్ని వర్గాల నుంచి సుదీర్ఘ వాదనలు విన్న న్యాయస్థానం 

డిసెంబర్‌ 23న తీర్పు రిజర్వు.. తాజాగా ఈడీ 9 అప్పీళ్లను కొట్టివేస్తూ స్పష్టమైన తీర్పు

గతంలోనే 3 కేసుల్లో హైకోర్టు ఊరట

సాక్షి, హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వై.ఎస్‌. జగన్‌మోహన్‌రెడ్డిపై అక్రమంగా ఆరోపించిన కేసుల్లో వాన్‌పిక్‌ (వాడరేవు–నిజాంపట్నం పోర్ట్స్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ కారిడార్‌) వ్యవహారంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ)కి తెలంగాణ హైకోర్టులో భారీ ఎదురుదెబ్బ తగిలింది. వాన్‌పిక్‌ ప్రాజెక్టుకు సంబంధించిన ఆస్తులను విడుదల చేస్తూ ప్రివెన్షన్‌ ఆఫ్‌ మనీ లాండరింగ్‌ యాక్ట్‌ (పీఎంఎల్‌ఏ) అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌ ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు సమర్ధించింది. ట్రిబ్యునల్‌ ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ ఈడీ దాఖలు చేసిన తొమ్మిది పిటిషన్లు కొట్టివేసింది.

ఈ మేరకు జస్టిస్‌ పి. శామ్‌ కోషి, జస్టిస్‌ సుద్దాల చలపతిరావు ధర్మాసనం.. అన్ని వర్గాల నుంచి సుదీర్ఘ వాదనలు విని గతేడాది డిసెంబర్‌ 23న తీర్పు రిజర్వు చేసింది. శుక్రవారం తీర్పు వెలువరించింది. ట్రిబ్యునల్‌ ఉత్తర్వులు, అందులోని నిర్ధారణలు, పత్రాలను సమగ్రంగా పరిశీలించిన ధర్మాసనం.. ఆ ఉత్తర్వుల్లో జోక్యం చేసుకొనేలా ఎటువంటి కొత్త ఆధారాలు లేదా చట్టపరమైన కారణాలను ఈడీ చూపించలేదని కుండబద్దలు కొట్టినట్లు చెప్పింది.

ట్రిబ్యునల్‌ ఇచ్చిన కారణాలు సమంజసంగా ఉన్నాయని సమర్ధించింది. వాటిని తప్పుబట్టేందు కు తగిన ఆధారాలు రికార్డులో లేవని స్పష్టం చేసింది. దీంతో ఈడీ దాఖలు చేసిన 9 అప్పీళ్లను కొట్టివేస్తూ.. ట్రిబ్యునల్‌ ఉత్తర్వులను యథాతథంగా వెంటనే అమలు చేయాలని తేల్చిచెప్పింది. అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌ మొత్తం 12 కేసుల్లో ఉత్తర్వులు జారీ చేయగా గతంలో హైకోర్టు మూడు కేసుల్లో ఊరటనిచ్చింది. దీంతో వై.ఎస్‌. జగన్‌మోహన్‌రెడ్డి, పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్‌తోపాటు సంబంధిత కంపెనీలకు ఇది కీలక న్యాయపరమైన విజయంగా పలువురు అభివర్ణిస్తున్నారు. 

ఏమిటి వాన్‌పిక్‌ కేసు? 
వాడరేవు, నిజాంపట్నం ప్రాంతాల్లో ప్రపంచ స్థాయి ఓడరేవులు, పారిశ్రామిక కారిడార్, ప్రత్యేక ఆర్థిక మండళ్లు, షిప్‌యార్డ్, విమానాశ్రయం వంటి మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో వాన్‌పిక్‌ ప్రాజెక్టును ప్రతిపాదించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌లోని రస్‌ అల్‌ ఖైమా ప్రభుత్వం మధ్య ప్రభుత్వ–ప్రభుత్వ (జీటుజీ) విధానంలో ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకుంది.

ఈ ప్రాజెక్టులో ప్రయోజనాలు పొందిన నిమ్మగడ్డ ప్రసాద్, ప్రతిఫలంగా జగన్‌కు చెందిన కంపెనీల్లో రూ. 863.33 కోట్ల పెట్టుబడులు పెట్టారన్న నాటి అధికార, ప్రతిపక్ష కుట్రలో భాగంగా సీబీఐ, ఈడీ కేసులు నమోదు చేశాయి. అక్రమంగా మనీలాండరింగ్‌ కేసులు నమోదు చేసి, పలు ఆస్తులను ఈడీ జప్తు చేసింది. ఈ జప్తు ఉత్తర్వులను అడ్జుడికేటింగ్‌ అథారిటీ సమర్థించడంతో జగన్‌మోహన్‌రెడ్డి, నిమ్మగడ్డ ప్రసాద్‌ సహా కంపెనీలు అప్పీలేట్‌ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించాయి. 

ట్రిబ్యునల్‌ఏం చెప్పింది? 
విచారణ అనంతరం ట్రిబ్యునల్‌కీలక వ్యాఖ్యలు చేసింది. వాన్‌పిక్‌ ప్రాజెక్టు అధికారికంగా అమల్లోకి రావడానికి ముందే సంబంధిత పెట్టుబడులు జరిగాయని.. కాబట్టి వాటిని ప్రాజెక్టుకు ప్రతిఫలంగా ఇచ్చినట్లు లేదా క్విడ్‌ ప్రో కోగా పేర్కొనలేమంది. అక్రమ పెట్టుబడులను నిర్ధారించేందుకు ఎలాంటి ఆధారాలు కూడా లేవని ట్రిబ్యునల్‌ అభిప్రాయపడింది. ఈడీ జప్తు చేసిన ఆస్తులను వెంటనే విడుదల చేయాలని ఆదేశిస్తూ.. 2019 జూలైలో ఉత్తర్వులు జారీ చేసింది. అనేక మంది ఉద్యోగులు పనిచేస్తున్న మీడియా సంస్థ జగతి పబ్లికేషన్స్‌ ఆస్తుల బదిలీని నిలిపివేస్తూ హైకోర్టు ఆదేశాలు ఉన్నందున, ఆ సంస్థకు సంబంధించిన రూ. 273.39 కోట్ల విలువైన ప్లాంట్, యంత్రాల జప్తును కొనసాగించాల్సిన అవసరం లేదని పేర్కొంది.

మొత్తం 60 మంది పెట్టుబడిదారులు (నిమ్మగడ్డ ప్రసాద్, ఆయన గ్రూప్‌ కంపెనీలతో సహా) ఒక్కో షేరుకు రూ. 360 చొప్పున షేర్లను కొనుగోలు చేశారన్న వాస్తవాన్ని ఈడీ తరఫు న్యాయవాది కూడా కాదనలేదు. 60 మందిలో 45 మంది పెట్టుబడిదారులపై ఎటువంటి చర్యలూ తీసుకోలేదు. పెట్టుబడి పెట్టిన వారిలో కొందరిని మాత్రమే ప్రత్యేకంగా ఎంచుకొని వారి వ్యవహారాలను క్విడ్‌ ప్రో కోగా ఆరోపించడం వెనుక ‘ఎంపిక చేసుకునే విధానం’అవలంభిస్తోందని సందేహం కలుగుతోందని ట్రిబ్యునల్‌ అనుమానం వ్యక్తం చేస్తూ జప్తు ఉత్తర్వులను రద్దు చేసింది. ప్రభుత్వ విధాన నిర్ణయాల్లో దర్యాప్తు సంస్థల జోక్యం సరికాదని వ్యాఖ్యానించింది. 

ప్రభుత్వ అనుమతితోనే పెట్టుబడులు.. 
ట్రిబ్యునల్‌ నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ 2019 అక్టోబర్‌లో ఈడీ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. వాన్‌పిక్‌ ప్రాజెక్టు పేరుతో ప్రభుత్వ విధానాలను దురి్వనియోగం చేసి భారీ ప్రయోజనాలు పొందారని.. ప్రాజెక్టు కేటాయింపులో అక్రమాలు జరిగాయని ఈడీ వాదించింది. ప్రతివాదుల తరఫున న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ.. ప్రాజెక్టు పూర్తిగా ప్రభుత్వ–ప్రభుత్వ ఒప్పందం ఆధారంగా చేపట్టారన్నారు. రస్‌–అల్‌–ఖైమా ప్రభుత్వం అధికారిక భాగస్వామిగా వ్యవహరించిందన్నారు. ప్రాజెక్టు కోసం జరిగిన పెట్టుబడులు, భూముల కొనుగోళ్లు, కంపెనీల ఏర్పాటు అన్నీ ప్రభుత్వ అనుమతులతోనే జరిగాయని కోర్టుకు తెలిపారు. 

ప్రతివాదులకు ఊరట.. 
హైకోర్టు కొట్టివేసిన అప్పీళ్లలో జీ2 కార్పొరేట్‌ సర్విసెస్, సుగుణి కన్‌స్ట్రక్షన్స్‌ ఎల్‌ఎల్‌పీ, జగతి పబ్లికేషన్స్, గిల్‌క్రిస్ట్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, ఆల్ఫా అవెన్యూ ప్రైవేట్‌ లిమిటెడ్, కార్మెల్‌ ఏసియా హోల్డింగ్స్, వై.ఎస్‌. జగన్‌మోహన్‌రెడ్డి, ఆల్ఫా విలాస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, నిమ్మగడ్డ ప్రసాద్‌ తదితర ప్రతివాదులకు ఊరట లభించింది. (వాన్‌పిక్‌ పోర్ట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ అండ్‌ అదర్స్, వాన్‌పిక్‌ ప్రాజెక్ట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, వాన్‌పిక్‌ పోర్ట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌లకు రెండేళ్ల కిత్రం జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ ఆధ్వర్యంలోని ధర్మాసనం ఇచ్చిన ఉత్తర్వుల్లో ఊరట లభించిన విషయం తెలిసిందే) 

ట్రిబ్యునల్‌ నాటి ఉత్తర్వుల్లోని మరికొన్ని అంశాలు.. 
వాన్‌పిక్‌ ప్రాజెక్టు రస్‌–అల్‌–ఖైమా (యూఏఈ) ప్రభుత్వంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రభుత్వ–ప్రభుత్వ ఒప్పందం కింద ప్రారంభించిందన్న వాదనలకు రికార్డుల్లో ఆధారాలు ఉన్నాయంది. పరిశ్రమల అభివృద్ధి కోసం ప్రభుత్వం నేరుగా చర్చలు జరిపి ఒప్పందాలు కుదుర్చుకోవచ్చని గుర్తుచేసింది. వాన్‌పిక్‌ ప్రాజెక్టుకు సంబంధించిన పలు అంశాల్లో సీబీఐ, ఈడీలు విధాన నిర్ణయాలను కూడా నేరపూరిత చర్యలుగా చిత్రీకరించే ప్రయత్నం చేశాయని వ్యాఖ్యానించింది.

ప్రభుత్వం తీసుకున్న ఆర్థిక, పారిశ్రామిక విధాన నిర్ణయాలను దర్యాప్తు సంస్థలు తమ అభిప్రాయాలతో భర్తీ చేయలేవని పేర్కొంది. ప్రభుత్వానికి విధానపరమైన నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ ఉంటుందని స్పష్టం చేసింది. అంతేకాకుండా, అవగాహన ఒప్పందంలోని ప్రతి అంశం తుది ఒప్పందంలో యథాతథంగా ఉండాల్సిన అవసరం లేదని, భారీ మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో పరిస్థితులకు అనుగుణంగా మార్పులు సహజమని అభిప్రాయపడింది. అడ్జుడికేటింగ్‌ అథారిటీ పలు కీలక పత్రాలు, వాదనలను సరిగా పరిశీలించలేదంది. 

వాన్‌పిక్‌ కేసుల్లో ఈడీ అటాచ్‌ చేసిన ఆస్తులివే... 
మొత్తం ఆస్తుల విలువ: 863.33 కోట్లు 
వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గ్రూప్‌: రూ.538.31 కోట్లు 
నిమ్మగడ్డ ప్రసాద్‌ గ్రూప్‌: రూ. 325.02 కోట్లు 

వైఎస్‌ జగన్‌కు చెందిన కంపెనీల్లో.. 
వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి: రూ. 68.31 కోట్లు (సండూర్‌ పవర్స్‌: 54.94 కోట్లు, స్థిరాస్తులు: 13.35 కోట్లు) 
జగతి పబ్లికేషన్స్‌: రూ. 450.00 కోట్లు 
కార్మెల్‌ ఆసియా హోల్డింగ్స్‌: రూ. 20.00 కోట్లు 

నిమ్మగడ్డ ప్రసాద్‌కు చెందిన కంపెనీల్లో... 
నిమ్మగడ్డ ప్రసాద్‌:    రూ. 37.83 కోట్లు 
ఆల్ఫా అవెన్యూస్‌:    రూ. 97.82 కోట్లు 
ఆల్ఫా విల్లాస్‌:    రూ. 35.90 కోట్లు 
గిల్‌క్రిస్ట్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌:    రూ. 45.85 కోట్లు 
జి2 కార్పొరేట్‌ సర్విసెస్‌:    రూ. 49.98 కోట్లు 
సుగుణి కన్‌స్ట్రక్షన్స్‌:    రూ. 7.00 కోట్లు 
వాన్‌పిక్‌ పోర్ట్స్‌: రూ. 23.23 కోట్లు 
వాన్‌పిక్‌ ప్రాజెక్ట్స్‌: రూ. 27.72 కోట్లు 
(ఇందులో వాన్‌పిక్‌ పోర్ట్స్, వాన్‌పిక్‌ ప్రాజెక్టుపై ఉత్తర్వులు గతంలోనే వెలువడ్డాయి)  

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement