
పెత్తనం నీదా.. నాదా!
సైదాపురం మండలంలోని గనుల కోసం కూటమి నేతలు కొట్లాడుకుంటున్నారు. ప్రధానంగా శ్రీనివాసా పద్మావతి మైన్ను సొంత చేసుకునేందుకు ప్రచ్ఛన్న యుద్ధానికి తెరలేపారు. నెల్లూరుకు చెందిన ఓ ముఖ్యనేత ఆధిపత్యం సహించలేని స్థానిక ప్రజాప్రతినిధి మండిపడుతున్నారు. ఆదివారం ఈ క్రమంలోనే పోలీసు.. రెవెన్యూ అధికారులను రంగంలోకి దించారు. అయితే సదరు ముఖ్యనేత జోక్యం చేసుకోవడంతో చేసేదిలేక చేతులెత్తేశారు. తూతూమంత్రంగా చర్యలు తీసుకుని ముఖం చాటేశారు.
సైదాపురం : మండలంలోని రామసాగరం, సైదాపురం గ్రామాలకు చెందిన ప్రభుత్వ భూమిని శ్రీనివాసాపద్మావతి గనికి గతంలో కేటాయించారు. 2019లోనే లీజు కాలపరిమితి తీరిపోవడంతో అది కాస్తా మూతపడింది. ఈ క్రమంలోనే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దానిపై పలువురు నేతల కన్నుపడింది. ఎలాంటి అనుమతులు లేకుండా నెల్లూరుకు చెందిన టీడీపీ పెద్దల ఆధ్వర్యంలో మైనింగ్ ప్రారంభమైంది. ఈ క్రమలంలో ఆదివారం రామసాగరం గ్రామస్తులు కొందరు అక్రమ మైనింగ్ను అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహించిన మైనింగ్ సిండికేట్కు చెందిన వ్యక్తులు తమకు అధికారపార్టీ ఎంపీ, మరో నాయకుడి మద్దతు ఉందని గ్రామస్తులను బెదిరించి తరిమేశారు.
ప్రజాప్రతినిధి ఆగ్రహం
మైనింగ్ సిండికేట్ దౌర్జన్యాలపై రామసాగరం గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు స్థానిక ప్రజాప్రతినిధి దృష్టికి విషయం తీసుకెళ్లారు. దీంతో ఆయన వెంటనే ఫోన్ చేసి మైనింగ్ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. ఈ మేరకు మైన్ వద్దకు వచ్చిన పోలీసులు 8 మోటారుసైకిళ్లు, ఓ ఎస్యూవీ వాహనాన్ని స్వాధీనం చేసుకుని పోలీస్స్టేషన్కు తరలించారు. తదనంతరం ఏం జరిగిందో కానీ.. పోలీసులు సీజ్ చేసి వాహనాలు స్టేషన్ ఆవరణ నుంచి వెళ్లిపోయాయి. ఈ విషయం స్థానిక ప్రజాప్రతినిధికి తెలియడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. వారి ఆదేశాల మేరకు వెంటనే తహసీల్దార్ రమాదేవి, ఎస్ఐ క్రాంతికుమార్ హుటాహుటిన శ్రీనివాసా పద్మావతి గని వద్దకు చేరుకున్నారు. అక్రమ మైనింగ్పై విచారణ చేపట్టారు.
అనుమతులు ఎలా..?
శ్రీనివాసా పద్మావతి గనిలో మైనింగ్ కోసం వచ్చిన దరఖాస్తును జనవరిలో తిరస్కరించారు. ఇంతలో ఏమైందో తెలియదు కానీ, నెల గడవక ముందే సదరు గనిలో 1.5లక్షల టన్నుల ఖనిజం తవ్వుకుని తరలించుకునేందుకు అనుమతులు మంజూరయ్యాయి. అది కూడా ఈ గనిపై కోర్టులో కేసు నడుస్తుండగానే అధికారులు పర్మిషన్ ఇవ్వడం గమనార్హం.
గని వద్ద యంత్రం ఉన్న దృశ్యం
గనిలో నీరు పంపింగ్ చేస్తున్న దృశ్యం
శ్రీనివాసా పద్మావతి గని కోసం
కూటమి నేతల ఘర్షణ
సిండికేట్కు వ్యతిరేకంగా
స్థానిక ప్రజాప్రతినిధి ఆదేశాలు
ముఖ్య నేత జోక్యంతో
తలలు పట్టుకుంటున్న అధికారులు
మైనింగ్కు అనుమతి లేదు
శ్రీనివాసా పద్మావతి గనిలో అక్రమ మైనింగ్పై ఫిర్యాదులు వచ్చాయి. కలెక్టర్ ఆదేశాల మేరకు గనిని పరిశీలించాం. ఇక్కడ కేవలం పంపింగ్ మాత్రమే చేస్తున్నారు. ఖనిజం తరలించేందుకే అనుమతి ఉంది. మైనింగ్కు లేదు.
– రమాదేవి, తహసీల్దార్, సైదాపురం
ఫిర్యాదు అందలేదు
శ్రీనివాసా పద్మావతి గనిలో అక్రమ మైనింగ్పై ఇప్పటి వరకు ఎలాంటి ఫిర్యాదు అందలేదు. ఎవరైనా ఫిర్యాదు చేస్తే వెంటనే చర్యలు తీసుకుంటాం. ఇక్కడ వాహనాలను స్వాధీనం చేసుకోలేదు. ఎవరినీ అదుపులోకి తీసుకోలేదు.
– క్రాంతికుమార్, ఎస్ఐ, సైదాపురం

పెత్తనం నీదా.. నాదా!
Comments
Please login to add a commentAdd a comment