సిద్ధార్థ ఇంజినీరింగ్ కళాశాలకు అటానమస్ హోదా
తిరుపతి రూరల్: తిరుపతి రూరల్ మండలం సి.గొల్లపల్లెలోని సిద్ధార్థ ఇంజినీరింగ్, ఎంబీఏ కళాశాలలకు యూజీసీ అటానమస్ హోదా (స్వయంప్రతిపత్తి) లభించిందని సిద్ధార్థ ఎడ్యుకేషనల్ అకాడమీ సెక్రటరీ వై.ఆనందరెడ్డి తెలిపారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. 1985లో రాయలసీమ ప్రాంతంలో పేద విద్యార్థులకు నాణ్యమైన కార్పొరేట్ విద్యను అందించాలనే ఉద్దేశంతో వై.కొండారెడ్డి, యం.వెంకట్రామిరెడ్డి రాయలసీమ విద్యాసంస్థలను ప్రారంభించినట్టు వివరించారు. గత 40 ఏళ్లుగా విద్యాసంస్థల్లో అనేక విప్లవాత్మక మార్పులు తీసుకురావడమే కాకుండా కొత్త రకం కోర్సులను తెచ్చి విద్యార్థులను ఉన్నత స్థాయిలో స్థిరపడేలా చేయడం జరిగిందన్నారు. పేద విద్యార్థులకు టెక్నికల్ విద్యను కూడా చేరువ చేయాలన్న ఉద్దేశంతో 2009లో సిద్ధార్థ ఇంజినీరింగ్, ఎంబీఏ కళాశాలలను స్థాపించినట్టు తెలిపారు. విద్యార్థులకు అన్నిరకాలు శిక్షణ అందించి మల్టీ నేషనల్ కంపెనీల్లో ఉద్యోగ అవకాశం సంపాధించుకునేలా చేయడం జరిగిందన్నారు. ఈ విద్యాసంవత్సరంలో న్యాక్ గుర్తింపు పొంది స్వయంప్రతిపత్తి హోదాను సాధించినట్టు వివరించారు. కళాశాల చైర్మన్ వై.కొండారెడ్డి, వైస్ చైర్మన్ విజయ్రెడ్డి, ప్రిన్సిపల్ డాక్టర్ రాజశేఖర్ పాల్గొన్నారు.
‘మెగా’ నిర్లక్ష్యంపై కార్మికుల కన్నెర్ర
● రెండు నెలలుగా అందని వేతనాలు
● మెగా సంస్థ కార్యాలయ గేట్లు మూసి నిరసనకు దిగిన కార్మికులు
శ్రీకాళహస్తి : మదనపల్లె–నాయుడుపేట ఆరు లేన్ల జాతీయ రహదారి విస్తరణ పేరిట పనులు చేపట్టిన మెగా సంస్థ అడగడుగునా కార్మికుల పట్ల నిర్లక్ష్యం వహిస్తోంది. కార్మికుల భద్రతను గాలికొదిలేసిన ఆ సంస్థ వేతనాల విషయంలోనూ ఎగవేత ధోరణిని అవలంభిస్తోంది. మెగా సంస్థకు మ్యాన్ పవర్ను సరఫరా చేస్తున్న కాంట్రాక్టర్కు గత రెండు నెలలుగా కార్మికులకు వేతనాలు చెల్లించడం లేదు. దీంతో కార్మికులు సోమవారం శ్రీకాళహస్తి సమీపంలో ఉన్న మెగా బేస్ క్యాంపు వద్ద గేట్లను మూసి నిరసన తెలియజేశారు. కనీసం సంక్రాంతికి కూడా తమకు వేతనాలు ఇవ్వకపోవడంతో పండుగను కుటుంబంతో కలిసి జరుపుకో లేకపోయామని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. వేతనాలు వెంటనే మంజూరయ్యేలా చొరవ చూపాలని డిమాండ్ చేశారు. లేకుంటే మెగా పనులను అడ్డుకుంటామని హెచ్చరించారు. కార్మికుల ఆందోళనతో దిగొచ్చిన మెగా జీఎం మల్లికార్జున మంగళవారం సాయంత్రం లోపు జీతాలు చెల్లించే ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వడంతో కార్మికులు ఆందోళన విరమించారు.
ఎంబీఏ విద్యార్థులకు నైపుణ్య శిక్షణ
తిరుపతి సిటీ : కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా బజాజ్ ఫైన్ సర్వీస్ సంస్థ స్థానిక కరకంబాడి రోడ్డులోని ఎస్వీసీఈ కళాశాల ఎంబీఏ విద్యార్థులకు స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్పై శిక్షణ ఇచ్చారు. కళాశాలలో సోమవారం జరిగిన ఈ కార్యక్రమంలో ముంబై వాల్చంద్ పీపుల్స్ ప్రాజెక్ట్ హెడ్ రష్మీ మన్చాని ఆన్లైన్ ద్వారా పాల్గొన్నారు. విద్యార్థులకు కమ్యూనికేషన్ స్కిల్స్, పారిశ్రామిక రంగంలో ఉద్యోగాల సాధనకు అవసరమైన నైపుణ్యం గురించి వివరించారు. ఉద్యోగాన్వేషణలో బిజినెస్ మేనేజ్మెంట్ విద్యార్థులు అడిని సందేహాలను నివృత్తి చేశారు. పలు సలహాలు, సూచనలు అందజేశారు. కార్యక్రమంలో ఎస్వీసీఈ ప్రిన్సిపల్ సుధాకర్రెడ్డి, హెడ్ ప్రొఫెసర్ నీరజ, బజాజ్ ఫైన్ సర్వీస్ ప్రోగ్రామ్ ఇన్చార్జి రామకృష్ణ, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
సిద్ధార్థ ఇంజినీరింగ్ కళాశాలకు అటానమస్ హోదా
Comments
Please login to add a commentAdd a comment