అపార్‌కు అడ్డంకులు | - | Sakshi
Sakshi News home page

అపార్‌కు అడ్డంకులు

Published Wed, Feb 26 2025 7:54 AM | Last Updated on Wed, Feb 26 2025 7:50 AM

అపార్‌కు అడ్డంకులు

అపార్‌కు అడ్డంకులు

ఆధార్‌ కేంద్రాలకు పరుగులు..

చిన్నారులను పాఠశాలల్లో చేర్పించే సమయంలో విద్యార్థుల వివరాలు, ఆధార్‌ కార్డులోని వివరాలు ఒకేవిధంగా ఉంటేనే అపార్‌ నంబర్‌ వస్తుంది. లేనిపక్షంలో వెబ్‌సైట్‌లో వివరాలు నమోదు కావడం లేదు. ఆధార్‌లో వివరాలు తప్పుగా ఉన్న విద్యార్థులు వాటిని సరి చేసుకునేందుకు కేంద్రాల చుట్టూ తిరుగుతున్నారు. అక్కడ సరిచేయాలంటే సరైన ధ్రువపత్రాలు తీసుకురావాలని సూచిస్తుండటంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. పేరు పూర్తిగా లేకపోవడం, పుట్టిన తేదీల్లో తేడాలతో అపార్‌ నమోదులో సమస్యలు ఎదురవుతున్నట్లు ఉపాధ్యాయులు చెబుతున్నారు. విద్యార్థుల వివరాలు ఒక్కసారి అపార్‌లో నమోదైతే ఇక మార్పులు చేసుకోవడానికి ఎలాంటి వీలుండదు.

ఆధార్‌ వివరాల ఆధారంగా నమోదు

పాఠశాల, ఆధార్‌లో పేర్లు, పుట్టిన తేదీల్లో తేడాలుండటంతో ఇబ్బందులు

మార్పుచేర్పులకు సమయం పడుతుండటంతో నమోదులో జాప్యం

జిల్లాలో మొత్తం విద్యార్థులు 95,677

అమరచింత: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అపార్‌ (ఆటోమెటిక్‌ పర్మినెంట్‌ అకాడమిక్‌ అకౌంట్‌ రిజిస్ట్రీ) నమోదు ప్రక్రియ జిల్లాలో నత్తనడకన కొనసాగుతోంది. విద్యార్థుల ఉన్నత చదువులకు 12 అంకెలతో కూడిన అపార్‌ గుర్తింపు కార్డు జారీ చేయాలని కేంద్రం రెండేళ్ల కిందటే నిర్ణయించి రాష్ట్రాలకు ఆదేశాలిచ్చింది. ఎల్‌కేజీ నుంచి ఇంటర్మీడియట్‌ వరకు చదివే విద్యార్థులకు వీటిని అందించనున్నారు. అపార్‌ కార్డు కోసం విద్యాసంస్థల నిర్వాహకులు ఆధార్‌కార్డు ప్రకారం విద్యార్థుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. అయితే ఆధార్‌కార్డుల్లో నమోదైన తప్పులను సరి చేసుకునేందుకు విద్యార్థులు ఆధార్‌ కేంద్రాలను ఆశ్రయిస్తున్నారు. కాని అక్కడ జాప్యం అవుతుండటంతో అవస్థలు పడుతున్నారు. ఇప్పటికే యూడైస్‌లో ప్రభుత్వ, ప్రైవేట్‌, ఆదర్శ, గురుకుల, కేజీబీవీ పాఠశాలలు, ఇంటర్‌ కళాశాలల్లో మొత్తం 95,677 మంది విద్యార్థులున్నారు. ఏడాది కాలంగా విద్యార్థుల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నా ఎంతకీ లక్ష్యం చేరడం లేదు. ఐడీలు కేటాయింపునకు ఇబ్బందులు తలెత్తుతూనే ఉన్నాయి. జిల్లాలో 678 పాఠశాలలు, 95,677 మంది విద్యార్థులు ఉండగా ఇప్పటి వరకు కేవలం 33.37 శాతమే పూర్తయింది. అత్యధికంగా ఏదుల మండలంలో 57.73 శాతం.. అత్యల్పంగా వనపర్తి మండలంలో 20.98 శాతం నమోదైంది.

జిల్లాలో నేటికీ 33.37 శాతమే పూర్తి

మండలాల వారీగా నమోదు ఇలా..

తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి..

అపార్‌కార్డుకు విద్యార్థుల తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. కార్డు వివరాలు కేంద్ర, రాష్ట్ర విద్యాశాఖల వెబ్‌సైట్‌లో నమోదు చేస్తారు. అన్ని ధ్రువపత్రాలను డిజిటల్‌ లాకర్‌లో భద్రపర్చుకోవచ్చు. పాఠశాల మారినా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. వివిధ విద్యాసంస్థల్లో చేరికలు, మార్పులు, ఉద్యోగాల భర్తీ సమయం తదితర సమయాల్లో అపార్‌ కార్డు ఆధారంగా సమాచారం తీసుకునే అవకాశం ఉంటుంది. దీంతో విద్యార్థుల తల్లిదండ్రుల అనుమతితో వివరాలు నమోదు చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement