ప్రభుత్వ పాఠశాలలకు నాసిరకం బియ్యం సరఫరా | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ పాఠశాలలకు నాసిరకం బియ్యం సరఫరా

Published Fri, Mar 7 2025 12:36 AM | Last Updated on Fri, Mar 7 2025 12:36 AM

ప్రభు

ప్రభుత్వ పాఠశాలలకు నాసిరకం బియ్యం సరఫరా

ఖిల్లాఘనపురం: ప్రభుత్వ పాఠశాలల్లో కొనసాగే మధ్యాహ్న భోజనానికి నాణ్యమైన సన్నబియ్యం సరఫరా చేయాలని ప్రభుత్వ నుంచి ఆదేశాలు ఉన్నప్పటికీ అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. వనపర్తి జిల్లా ఖిల్లాఘనపురం మండలంలోని పలు ప్రభుత్వ పాఠశాలలకు ఇటీవల పంపిణీ చేసిన బియ్యం పురుగుపట్టి ఉండటంతో ఉపాధ్యాయులు, విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారు. గత నెల మామిడిమాడ ఉన్నత పాఠశాలకు వచ్చిన 18 బస్తాల బియ్యంలో పురుగులు ఉండటంతో హెచ్‌ఎం చెన్నప్ప విషయాన్ని గ్రామపెద్దలు దృష్టికి తీసుకెళ్లారు. వారు వనపర్తి స్టాక్‌ పాయింట్‌ అధికారులతో మాట్లాడి తిప్పి పంపించి మంచి బియ్యం తీసుకొచ్చారు. రేషన్‌ దుకాణాలు, అంగన్‌వాడీ కేంద్రాలకు వస్తున్న బియ్యం మంచిగా ఉన్నాయని.. పాఠశాలలకు పురుగులు పట్టిన బియ్యాన్ని ఎందుకు పంపిణీ చేస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. మండలంలోని వెనికితండా, అప్పారెడ్డిపల్లి ప్రభుత్వ పాఠశాలలకు సరఫరా చేసిన పురుగుల బియ్యం ఏం చేయాలో తెలియక అలాగే ఉంచారు. ఈ విషయాన్ని ఎంఈఓ జయశంకర్‌ వద్ద ప్రస్తావించగా.. వెనికితండా, అప్పారెడ్డిపల్లి, మామిడిమాడ ఉన్నత పాఠశాలలకు వచ్చిన బియ్యంలో పురుగులు ఉన్నట్లు తమ దృష్టికి వచ్చిందని జిల్లా అధికారులకు వివరించామని తెలిపారు.

1,018 అడుగుల

నీటిమట్టం

మదనాపురం: మండలంలోని రామన్‌పాడు జలాశయంలో గురువారం 1,018 అడుగుల నీటిమట్టం ఉన్నట్లు ఏఈ వరప్రసాద్‌ తెలిపారు. జూరాల ఎడమ కాల్వ నుంచి 550 క్యూసెక్కుల వరద కొనసాగుతుండగా.. సమాంతర కాల్వ ద్వారా నీటి సరఫరా లేదన్నారు. ఎన్టీఆర్‌ కాల్వకు 84 క్యూసెక్కులు, కుడి, ఎడమ కాల్వలకు 119 క్యూసెక్కులు, తాగునీటి అవసరాలకు 20 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నామని వివరించారు.

శిక్షణ కేంద్రాలను

వినియోగించుకోవాలి

ఖిల్లాఘనపురం: గిరిజన మహిళల అభ్యున్నతికి నిర్వహిస్తున్న శిక్షణ కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర వనితాజ్యోతి మహిళా సంఘం అధ్యక్షురాలు ఏకే కమర్‌ రహమాన్‌ కోరారు. గురువారం మండలంలోని సోళీపురం, కోతులకుంటతండాతో పాటు పలు తండాల్లో ఆమె పర్యటించారు. వీజేఎంఎస్‌ ఆవాజ్‌ వనపర్తి కమ్యూనిటీ రేడియో ద్వారా గిరిజన సంక్షేమశాఖ అందిస్తున్న అనేక పథకాల గురించి వినిపించారు. త్వరలోనే సోళీపురం గ్రామంలో సంఘం ఆధ్వర్యంలో కుట్టు శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. అందరు సహకరిస్తే వేసవిలో కంప్యూటర్‌ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభిస్తామని.. సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆమె వెంట గ్రామపెద్దలు పురేందర్‌రెడ్డి, మాజీ సర్పంచ్‌ శ్రీనునాయక్‌, గంధం చిట్టెమ్మ తదితరులు ఉన్నారు.

24 బస్తాల

రేషన్‌ బియ్యం పట్టివేత

ఖిల్లాఘనపురం: రేషన్‌ బియ్యాన్ని అక్రమంగా తక్కువ ధరకు కొనుగోలు చేసి రైస్‌మిల్లుకు తరలిస్తుండగా పట్టుకున్నట్లు పౌరసరఫరాలశాఖ నయాబ్‌ తహసీల్దార్‌ దుబ్బాక పరమేశ్వర్‌ తెలిపారు. ఆయన కథనం మేరకు.. గోపాల్‌పేట మండలం బుద్దారం గ్రామానికి చెందిన శ్రీమాన్‌పాడు రామకృష్ణ బుధవారం పలు గ్రామాల్లో 24 బస్తాల రేషన్‌ బియ్యం కొనుగోలు చేసి రాత్రి సమయంలో ఖిల్లాఘనపురం మండలం సోళీపురం గ్రామంలో ఉన్న సింధు రైస్‌మిల్లుకు వాహనంలో తరలించారు. జిల్లా సీసీఎస్‌ పోలీసులు పక్కా సమాచారంతో వాహనాన్ని వెంబడించారు. రైస్‌మిల్లులో బియ్యం దింపుతుండగా పట్టుకొని అదే వాహనంలో వనపర్తి స్టాక్‌ పాయింట్‌కి తరలించారు. గురువారం రైస్‌మిల్‌ యజమాని, బియ్యం తీసుకొచ్చిన రామకృష్ణపై కేసునమోదు చేయాలని ఖిల్లాఘనపురం పోలీసులకు ఫిర్యా దు చేశారు. కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ సురేశ్‌గౌడ్‌ తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
ప్రభుత్వ పాఠశాలలకు నాసిరకం బియ్యం సరఫరా 
1
1/1

ప్రభుత్వ పాఠశాలలకు నాసిరకం బియ్యం సరఫరా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement