రోడ్డున పడ్డ హెల్త్‌ అసిస్టెంట్లు | - | Sakshi
Sakshi News home page

రోడ్డున పడ్డ హెల్త్‌ అసిస్టెంట్లు

Published Wed, Mar 19 2025 1:08 AM | Last Updated on Wed, Mar 19 2025 1:13 AM

రోడ్డ

రోడ్డున పడ్డ హెల్త్‌ అసిస్టెంట్లు

సాక్షి, భీమవరం: రెండు దశాబ్దాలకు పైగా కాంట్రాక్టు హెల్త్‌ అసిస్టెంట్లుగా ప్రజలకు వైద్య సేవలందించిన వారిని కూటమి ప్రభుత్వం రోడ్డున పడేసింది. వీరిలో మరో ఐదారేళ్లలో రిటైరయ్యేవారు ఎంతోమంది ఉన్నారు. కూటమి ప్రభుత్వం తమ ఉద్యోగాలను రెగ్యులర్‌ చేస్తుందని గంపెడాశతో ఎదురుచూస్తున్నవారికి ఊహించని షాక్‌ ఇచ్చింది. కోర్టు తీర్పును సాకుగా చూపించి రాష్ట్ర వ్యాప్తంగా 920 మందిని ఉద్యోగాల్లో నుంచి తొలగించడంతో వారంతా కన్నీటి పర్యంతమవుతున్నారు.

జాబు కావాలంటే బాబు రావాలంటూ ఎన్నికల ప్రచారంలో ఊదరగొట్టిన కూటమి నేతలు.. అధికారంలోకి వచ్చాక కొత్త ఉద్యోగాలివ్వకపోగా ఉన్న ఉద్యోగులను తొలగించే పనిలో పడ్డారు. గ్రామీణ ప్రాంతాల్లో వైద్యసేవల కోసం పారామెడికల్‌ రిక్రూట్‌మెంట్‌ ద్వారా హెల్త్‌ అసిస్టెంట్ల (మేల్‌) నియామకానికి 2002 మే నెలలో నాటి ఉమ్మడి ప్రభుత్వం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. 2324 పోస్టులకు 10వ తరగతి పూర్తి చేసి హెల్త్‌ అసిస్టెంట్‌ ట్రైనింగ్‌ డిప్లమో ఉండడాన్ని విద్యార్హతగా ప్రకటించింది. పరీక్షకు 10వ తరగతి వారితో పాటు ఇంటర్‌ పూర్తి చేసి హెల్త్‌ అసిస్టెంట్‌ శిక్షణ పొందినవారు హాజరయ్యారు. జాబు రాని ఇంటర్‌ విద్యార్థులు కోరు్‌ుట్న ఆశ్రయించడంతో 2006లో వారికి అనుకూలంగా తీర్పు వచ్చింది. ఈ మేరకు సుమారు వెయ్యి మందిని హోల్డ్‌లో పెట్టి ఇంటర్‌ చదివిన వారిని విధుల్లోకి తీసుకున్నారు. తదనంతర పరిణామాలతో వారిని చేర్చుకోవడంతో ఉద్యోగుల సంఖ్య దాదాపు 3324కు చేరింది. నోటిషికేషన్‌ మేరకు 2324 మంది ఉద్యోగులు మాత్రమే ఉండాలని 2012లో కోర్టు తీర్పు ఇవ్వడంతో అదనంగా ఉన్న వెయ్యి మందిని తొలగించారు. వీరంతా ఆందోళన బాట పట్టడంతో అప్పటి ప్రభుత్వం మానవతా దృక్పథంతో విధుల్లోకి తీసుకుంది.

ఆగమేఘాలపై తొలగింపు : మార్కులు తక్కువ వచ్చిన వారికి ఉద్యోగాలు ఇచ్చారంటూ అప్పటి ఉమ్మడి రాష్ట్రంలోనే కొందరు హైకోర్టును ఆశ్రయించారు. డీ మెరిట్‌ ఉద్యోగులను తొలగించి వారికంటే ఎక్కువ మార్కులు వచ్చిన వారికి న్యాయం చేయాలని గత నవంబర్‌ 29న తెలంగాణ హైకోర్టు తీర్పునిచ్చింది. దీనిని సాకుగా చూపించి కోర్టు ఇచ్చిన 90 రోజుల గడువును పట్టించుకోకుండా తీర్పు వచ్చిన వారంలోపే ఆగమేఘాలపై డిసెంబరు 5, 6 తేదీల్లో ఉన్నతాధికారులు 920 మందిని తొలగించేశారని బాధిత ఉద్యోగులు చెబుతున్నారు. తెలంగాణలోని 280 మంది కాంట్రాక్టు ఉద్యోగులను అక్కడి ప్రభుత్వం నేటికీ కొనసాగిస్తుండటం గమనార్హం.

రోడ్డున పడ్డ కుటుంబాలు

రూ.3550 జీతానికి ఉద్యోగంలో చేరి ప్రస్తుతం రూ.30,200 జీతం అందుకుంటున్న 920 మంది కాంట్రాక్టు హెల్త్‌ అసిస్టెంట్లు, వారి కుటుంబాల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. వీరిలో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాకు చెందినవారు 70 మందికి పైగా ఉన్నారు. కోవిడ్‌ కష్టకాలంలో ప్రాణాలకు తెగించి పనిచేశామని, క్షేత్రస్థాయిలో వైద్యసేవలందించడంలో రెండు దశాబ్దాలకు పైగా కీలకంగా పనిచేస్తున్న తమ పట్ల ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా వ్యవహరించిందని వాపోతున్నారు. కోర్టు తీర్పు అమలుచేశామని చెబుతున్న పాలకులు, అధికారులు కాంట్రాక్టు పద్ధతిని రద్దు చేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని గతంలో న్యాయస్థానాలు ఇచ్చిన ఆదేశాలను ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నిస్తున్నారు. రేపోమాపో తమ ఉద్యోగాలు రెగ్యులర్‌ అవుతాయని ఎదురుచూస్తుంటే ఉన్న వాటిని తొలగించడం దారుణమంటున్నారు. ఉద్యోగాలు పోయిన బాధతో గుంటూరు, ఉత్తరాంధ్రలోని ఇద్దరు కాంట్రాక్టు ఉద్యోగులు గుండెపోటుతో ప్రాణాలను కోల్పోయినట్టు తెలిపారు.

920 మందిని తొలగించిన కూటమి సర్కారు

కాంట్రాక్టు ఉద్యోగులుగా రెండు దశాబ్దాలకు పైగా సేవలు

వీరిలో పలువురు ఐదారేళ్లలో రిటైరయ్యేవారే..

ఉద్యోగాలు పోవడంతో దిక్కుతోచని స్థితిలో కుటుంబాలు

నిర్దాక్షిణ్యంగా తొలగించారు

హైకోర్టు ఆదేశాల మేరకు 90 రోజుల గడువు ఉన్నప్పటికీ వారం లోపే తొల గిస్తూ ఆదేశాలిచ్చారు. ఇదెక్కడి న్యాయమని అధికారులు, పాలకులను అడిగితే పొంతన లేకుండా మాట్లాడుతున్నారు. ఉన్నత స్థాయి లోని కొందరు చేసిన తప్పులకు మా కాంట్రాక్టు ఉద్యోగులను బలిపశువులను చేశారు.

– సయ్యద్‌ జఫ్రుల్లా, యునైటెడ్‌ మెడికల్‌ అండ్‌ హెల్త్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ నేత

No comments yet. Be the first to comment!
Add a comment
రోడ్డున పడ్డ హెల్త్‌ అసిస్టెంట్లు 1
1/1

రోడ్డున పడ్డ హెల్త్‌ అసిస్టెంట్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement