
కేసులు పెట్టినా.. తగ్గేదేలే
సాక్షి, భీమవరం: మద్యం బెల్టు షాపులు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని కూటమి ప్రభుత్వం చెబుతుంటే.. షరామామూలే అన్నట్టు నిర్వాహకుల తీరుంది. గత ఐదు నెలల్లో బెల్టు విక్రయాలుపై జిల్లాలో 356 కేసులు నమోదు చేసిన ఎకై ్సజ్శాఖ 715 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకుంది. అయినా తగ్గేదే లేదన్నట్టుగా జిల్లాలోని సిండికేట్ వర్గాలు గుట్టుచప్పుడు కాకుండా బెల్టు అమ్మకాలు సాగిస్తున్నాయి. జిల్లాలో 193 మద్యం దుకాణాలకు సుమారు 71 షాపులు పట్టణ ప్రాంతాల్లో, పంచాయతీల పరిధిలో మిగిలిన 122 షాపులు ఏర్పాటుచేశారు. మద్యం దుకాణాలు లేని గ్రామాల్లో లిక్కర్ సిండికేట్లు బెల్టులు పెట్టి అమ్మకాలు చేయిస్తున్నారు. ఒక్కో లైసెన్స్డ్ షాపు పరిధిలో రెండు నుంచి ఐదు వరకు బెల్టులు ఉన్నట్టు సమాచారం. తీరప్రాంతం, మెట్ట గ్రామాల్లో కొన్ని చోట్ల వేలం పాటల ద్వారా బెల్టులు అప్పగించారు. మొగల్తూరు మండలానికి చెందిన కూటమి నాయకుడు బెల్టు షాపు కోసం బేరసారాలు సాగించిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్ కూడా అయ్యాయి. కొన్ని చోట్ల రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు డిపాజిట్లు చెల్లించిన వారికి, కూటమి కార్యకర్తలకు బెల్టులు అప్పగించారు. చిన్న చిన్న దుకాణాలు, కిళ్లీ బడ్డీల్లో బాటిళ్లు ఉంచి క్వార్టర్, బీర్ బాటిల్పై అదనంగా రూ.30 నుంచి రూ.40 వరకు అమ్మకాలు చేస్తున్నారు. కొందరు నిర్వాహకులు వాహనాల్లో మద్యం బాటిల్స్ పెట్టుకుని మందుబాబుల చెంతకు చేరవేస్తూ మొబైల్ సర్వీస్ అందిస్తున్నారు.
358 మందిపై కేసులు
కూటమి ప్రభుత్వం మద్యాన్ని ప్రైవేట్ పరం చేసిన నాటి నుంచి ఆరు నెలల్లో బెల్టు అమ్మకాలపై జిల్లాలో 356 కేసులు నమోదుచేసిన ఎకై ్సజ్ అధికారులు 358 మందిని అరెస్టు చేసి 715 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. అత్యధికంగా తాడేపల్లిగూడెం స్టేషన్ పరిధిలో 85 కేసులు నమోదు కాగా నరసాపురం పరిధిలో 70 నమోదయ్యాయి. తక్కువగా ఆకివీడు పరిధిలో 40 కేసులు నమోదయ్యాయి. పదికి పైగా బాటిళ్లతో దొరికితే కోర్టులో హాజరుపర్చాలి. పది బాటిల్స్ లోపు ఉంటే సెక్షన్ 34 (ఏ) కింద కేసు నమోదు చేసి స్టేషన్ బెయిల్ ఇచ్చి వదిలేయవచ్చని న్యాయవాది ఒకరు తెలిపారు. ఐదేళ్ల వరకు జైలు శిక్ష, రూ.లక్ష వరకు జరిమానా పడే అవకాశముందని, అయితే నేరం రుజువై శిక్ష పడిన ఘటనలు చాలా అరుదని చెబుతున్నారు. బెల్టులు లేకుండా చేస్తున్నామని చెప్పుకునేందుకు కూటమి ప్రభుత్వం ఎకై ్సజ్ అధికారులతో తూతూమంత్రంగా సెక్షన్ 34 (ఏ) కేసులతో తంతు నడిపిస్తోందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బెల్టు అమ్మకాలు చేస్తే ఉపేక్షించేది లేదని, నిబంధనల మేరకు దాడులు నిర్వహించి బెల్టు అమ్మకాలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకుంటున్నామని ఎకై ్సజ్ అధికారులు చెబుతున్నారు.
బెల్టు షాపులపై నమోదైన కేసుల వివరాలు
ఎకై ్సజ్ స్టేషన్ కేసులు పట్టుబడిన స్వాధీనం
వారు చేసుకున్న మద్యం (లీటర్లలో)
ఆకివీడు 40 40 59.94
భీమవరం 55 56 246.24
నర్సాపురం 70 70 102.42
పాలకొల్లు 43 43 53.64
తాడేపల్లిగూడెం 85 85 160.06
తణుకు 63 64 93.10
బెల్టు షాపులపై 358 కేసులు
715 లీటర్ల మద్యం స్వాధీనం
అయినా షరామామూలుగానే బెల్టు అమ్మకాలు
స్టేషన్ బెయిలిచ్చి పంపేస్తున్న అధికారులు
మాటలకే పరిమితం
ఎమ్మార్పీకి మించి అమ్మకాలు చేసినా, బెల్టులు ఏర్పాటు చేసినా మొదటిసారి రూ. 5 లక్షల జరిమానా విధించాలని, రెండోసారి తప్పు చేస్తే షాపు లైసెన్స్ రద్దుచేయాలని ఇటీవల ఒక సమీక్షలో సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఈ హెచ్చరికలను సిండికేట్ వర్గాలు సీరియస్గా తీసుకున్నట్టు లేదు. జిల్లాలోని పాలకొల్లు, తాడేపల్లిగూడెం, తణుకు, నరసాపురం తదితర చోట్ల పలు దుకాణాల్లో బాటిల్పై రూ.10 అదనంగా విక్రయిస్తున్నారు. పర్మిట్ రూంల మాదిరి సదుపాయాలతో నిబంధనలకు విరుద్ధంగా అమ్మకాలు చేస్తున్నా సీఎం ఆదేశాలు అమలుకు నోచుకోవడం లేదు.