నిందితుడికి 31 ఏళ్లు జైలు శిక్ష | - | Sakshi
Sakshi News home page

నిందితుడికి 31 ఏళ్లు జైలు శిక్ష

Published Fri, Mar 7 2025 8:54 AM | Last Updated on Fri, Mar 7 2025 8:54 AM

-

బాలికపై అత్యాచారం కేసులో తీర్పు వెలువరించిన

సూర్యాపేట జిల్లా కోర్టు

చివ్వెంల(సూర్యాపేట): బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడికి 31 ఏళ్లు జైలు శిక్షతో పాటు రూ.30వేల జరిమానా విధిస్తూ సూర్యాపేట జిల్లా కోర్టు స్పెషల్‌ సెషన్స్‌ జడ్జి ఎం. శ్యామ్‌శ్రీ గురువారం తీర్పు వెలువరించారు. ఆత్మకూర్‌(ఎస్‌) మండలం పాతర్లపహాడ్‌ గ్రామానికి చెందిన ఓ మహిళ తన భర్త చనిపోవడంతో ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడిని పోషించుకుంటూ జీవనం సాగిస్తోంది. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన గుంజ వెంకన్న అప్పుడప్పుడు సదరు మహిళ ఇంటికి వచ్చి వెళ్తూ ఉండేవాడు. ఈ క్రమంలో ఆమె చిన్న కుమార్తైపె అతడి కన్నుపడింది. బాలికపై పలుమార్లు వెంకన్న అత్యాచారానికి పాల్పడ్డాడు. 2021 మార్చి 31న బాలిక ఇంట్లో ఎవరూ లేని సమయంలో వచ్చి ఆమెకు గర్భస్రావ మాత్రలు ఇచ్చాడు. అదే రోజు మళ్లీ అత్యాచారం చేశాడు. బాలికకు కడుపునొప్పి రావడంతో హాస్పిటల్‌కు తీకెళ్తుండగా మార్గమధ్యలో కడుపునొప్పి ఎక్కువై కడుపులోంచి పిండం బయటపడింది. బాలికను తల్లి నిలదీయగా.. గుంజ వెంకన్న తనపై అత్యాచారం చేస్తున్నాడని విషయం చెప్పింది. బాలికకు చికిత్స చేయించిన అనంతరం 2021 ఏప్రిల్‌ 2న ఆమె తల్లి స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో అప్పటి డీఎస్పీ మోహన్‌కుమార్‌ కేసు నమోదు చేసి నిందితుడిని రిమాండ్‌కు తరలించారు. పలువురు సాక్షులను విచారించిన న్యాయమూర్తి పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ కాకి రాంరెడ్డి వాదనలతో ఏకీభవిస్తూ నిందితుడికి 31 ఏళ్లు జైలు శిక్షతో పాటు రూ.30 వేలు జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు. అదేవిధంగా బాలికకు రూ.5లక్షల నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించారు. పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌కు లైజన్‌ ఆఫీసర్‌ గంపల శ్రీకాంత్‌, కోర్టు కానిస్టేబుల్‌ వెంకటేశ్వర్లు సహకరించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement