
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
కమలాపురం : కడప–తాడిపత్రి ప్రధాన రహదారిలో మండలంలోని గొళ్లపల్లె వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో దేవుని కడపకు చెందిన కంబాల సుబ్బయ్య (45) మృతి చెందారు. పోలీసులు తెలిపిన సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. దేవుని కడపకు చెందిన సుబ్బయ్య తాడిపత్రిలోని ఓ ఇంజినీరింగ్ కాలేజీలో లెక్చరర్గా పని చేస్తున్నారు. సోమవారం తెల్లవారు జామున తన బైక్పై తాడిపత్రికి వెళ్తుండగా మార్గమధ్యంలో కమలాపురం మండలం గొళ్లపల్లె వద్ద గుర్తు తెలియని వాహనం ఢీ కొని వెళ్లి పోయింది. ఈ ఘటనలో తలకు బలమైన గాయం కావడంతో సుబ్బయ్య అక్కడికక్కడే మృతి చెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని శవ పంచనామా నిర్వహించి మృతదేహాన్ని రిమ్స్కు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ప్రతాప్రెడ్డి తెలిపారు. కాగా మృతునికి భార్య శిరీష, చిన్న వయస్సు గల ఇద్దరు కుమార్తెలు, ఒక ఒక కుమారుడు ఉన్నారు.
రెండో మారు కందుల
కొనుగోలు కేంద్రం ప్రారంభం
ప్రొద్దుటూరు : ప్రొద్దుటూరు వ్యవసాయ మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన కందుల కొనుగోలు కేంద్రాన్ని సోమవారం రెండో మారు ప్రారంభించారు. నాఫెడ్ ద్వారా ఏపీ మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో ఈ కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. కందుల కనీస మద్దతు ధర క్వింటాలకు రూ.7550 చొప్పున ప్రకటించారు. ఈనెల 11వ తేదీన బీజేపీ నాయకుడు, ఏపీ మార్క్ఫెడ్ డైరెక్టర్ వంగల శశిభూషణ్ రెడ్డి ఈ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఇదే కొనుగోలు కేంద్రాన్ని ఇదే స్థలంలో ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి సోమవారం ప్రారంభించారు. ఒకే కొనుగోలు కేంద్రాన్ని బీజేపీ, టీడీపీ పార్టీ నేతలు వేర్వేరుగా ప్రారంభించడం గమనార్హం. ఈ విషయంపై సంబంధిత అధికారులను వివరణ కోరగా మార్కెట్ యార్డులో కందుల కొనుగోలుకు సంబంధించిన ఏజెన్సీ వ్యక్తిని మార్చడంతోనే ఎమ్మెల్యే ఈ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment