
నిధుల కేటాయింపులో సీమను విస్మరిస్తే ఉద్యమం
కడప వైఎస్ఆర్ సర్కిల్ : నీటి పారుదల శాఖ రాయలసీమను విస్మరిస్తే ఉద్యమం చేపడతామని ఏపీ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జి.ఈశ్వరయ్య అన్నారు. నగరంలోని సీపీఐ కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ ఈ నెల 22వ తేదీ నుంచి 24వ తేదీ వరకు కడపలో జరిగే ప్రాజెక్టుల ప్రాంతీయ సదస్సు కార్యాచరణ వేదిక కానుందన్నారు. రూ.80 వేల కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన గోదావరి – భనకచర్ల ఎత్తిపోతల పథకం కాంట్రాక్టర్ల కడుపు నింపి ఎన్నికల నిధి పోగు చేసుకోవడానికి ఉపయోగపడుతోందని ఆరోపించారు. కృష్ణా డెల్టా ఆయకట్టు స్థిరీకరణ ద్వారా శ్రీశైలంలో క్యారీ ఓవర్ నీళ్లను రాయలసీమ ప్రాజెక్టులకు వాడుకునే వెసులుబాటు ఉంటుందని చెబుతూ వచ్చారని, నేడు కొత్త ప్రతిపాదనల పేరుతో రాయలసీమ ప్రజలను మభ్యపెడుతున్నారని వాపోయారు. పోలవరం పూర్తిచేస్తే పట్టిసీమకు ప్రాధాన్యం ఉండదని తెలిసినా రూ.1600 కోట్ల రూపాయలు ఖర్చు చేశారన్నారు. సీమ ప్రాజెక్టులకు రూ.10వేల కోట్లు కేటాయిస్తే ప్రాధాన్యత క్రమంలో పంట కాల్వల నిర్మాణం పూర్తయి పది లక్షల ఎకరాల ఆయకట్టు అభివృద్ధి చెందుతుందని ఆరోపించారు. కృష్ణానది యాజమాన్య బోర్డును కర్నూలులో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. స్వార్థ రాజకీయాలతో ఎగువ భద్ర ప్రాజెక్టుకు బీజేపీ ప్రభుత్వం జాతీయ హెూదా కల్పించిందన్నారు. శ్రీశైలం నీటిమట్టం 834 అడుగులకు రాకముందే నీటిని తోడేస్తున్నారన్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర, జిల్లా కార్యవర్గ సభ్యులు వెంకట శివ, చంద్రశేఖర్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment