ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రులు, ఆ పార్టీ నాయకులపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత అంబటి రాంబాబు విరుచుకుపడ్డారు. వైఎస్ జగన్కు మానసిక వ్యాధి ఉందంటూ టీడీపీ నేతలు చేసిన వ్యాఖ్యలపై ఆయన తీవ్రంగా స్పందించారు. చంద్రబాబుకు ఆయన వంశంలోనే పిచ్చి ఉందని, కానీ వైఎస్ వంశంలో మాత్రం ఎవరికీ లేదని చెప్పారు. మీ బావమరిది బాలకృష్ణ మానసిక స్థితి బాగోలేదని గతంలో వైద్యులు రిపోర్టు ఇచ్చిన విషయం వాస్తవం కాదా అని ఆయన నిలదీశారు. అలాగే మీ తమ్ముడు నారా రామ్మూర్తి నాయుడు మతి స్థిమితంలేక ఆస్పత్రిలో ఉన్న విషయం కూడా వాస్తవం కాదా అని అంబటి రాంబాబు ప్రశ్నించారు. వైఎస్ జగన్, చంద్రబాబు ఇద్దరికీ వైద్యపరీక్షలు చేయిద్దామని, చంద్రబాబు సంపూర్ణ ఆరోగ్యవంతుడని డాక్టర్లు ధ్రువీకరిస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాలు చేశారు. అలాగే వైఎస్ జగన్ ఆరోగ్యవంతుడు కారని చెప్పినా తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని తెలిపారు. టీడీపీ నేతలకు దమ్ముంటే ఈ సవాలు స్వీకరించాలని ఆయన చెప్పారు.