రాష్ట్ర రాజధాని నిర్మాణానికి అవసరమైన మొత్తం భూమిని ఆరు నెలల్లో సేకరించి, వర్గీకరించి, తర్వాత మరో ఆరునెలల్లో నిర్మాణ ప్రక్రియ చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించినట్లు రాజధానిపై నియమించిన మంత్రివర్గ ఉపసంఘం సభ్యుడు, మంత్రి పి.నారాయణ చెప్పారు. రాజధాని అంటే సచివాలయం, హైకోర్టు, ప్రధాన ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ ఉంటాయని తెలిపారు. రైతులకు ఎంత షేర్ ఇస్తారని అడిగినప్పుడు మాత్రం.. నేరుగా చెప్పకుండా ఇతర వివరాలు అన్నీ ఏకరువు పెట్టారు. చండీగఢ్లో ఎకరాకు 1100 చదరపు గజాలు ఇచ్చారని, అందులో వెయ్యి గజాలు రెసిడెన్షియల్, 100 గజాలు కమర్షియల్ ఇచ్చారని తెలిపారు. ఇది 22-23 శాతం అవుతుందన్నారు. గాంధీనగర్లో అభివృద్ధి చేసినదాంట్లో 25 శాతం, నయా రాయ్పూర్లో అభివృద్ధి చేసినదాంట్లో 35 శాతం ఇచ్చామన్నా, వాస్తవానికి వారికి వెళ్లింది 29 శాతమేనన్నారు. ఇవన్నీ చూసిన తర్వాత ప్రాంతాన్ని బట్టి, అక్కడ అభివృద్ధి చేయడానికి అయిన వ్యయాన్ని బట్టి ఎంత వాటా ఇవ్వాలన్నది నిర్ణయిస్తామన్నారు.