రాష్ట్రంలో యథేచ్చగా సాగుతున్న అక్రమ మైనింగ్లో ఏపీ సీఎం చంద్రబాబు నాయడు, ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావుల హస్తం ఉందని వైఎస్సార్ సీపీ సీనియర్ నాయకులు బొత్స సత్యనారాయణ ఆరోపించారు. లోటస్పాండ్లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబుకు చిత్త శుద్ది ఉంటే గుంటురు జిల్లాలో జరుగుతున్న అక్రమ మైనింగ్పై సీబీఐ విచారణ జరిపించాలని సవాలు విసిరారు. అక్రమ మైనింగ్పై తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్రెడ్డి విసిరిన సవాలును దమ్ముంటే ప్రభుత్వం స్వీకరించాలన్నారు. కొండను తవ్వి ఎలుకను పట్టినట్టు గనుల దోపిడిపై అసలు సూత్రధారులను కాపాడుతూ అధికారులకు నోటీసులివ్వడం సిగ్గుచేటని విమర్శించారు. ఈ ఒక్క విషయంతో ప్రజాధనాన్ని టీడీపీ ప్రభుత్వం ఎలా దోచుకుంటుందో ప్రజలకు అర్థమయిందని బొత్స పేర్కొన్నారు.