ప్రజా సంకల్పయాత్రలో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి విశాఖపట్నం జిల్లాలోని నర్సీపట్నంలో శనివారం జరిగిన భారీ బహిరంగ సభలో పాల్గొన్నారు. సభలో ఆయన మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వ అరాచక పాలనపై, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి అయ్యన్నపాత్రుడుపై విమర్శలు గుప్పించారు. చంద్రబాబు, అయ్యన్నపాత్రుడు నర్సీపట్నం నియోజకవర్గ ప్రజలకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు మరిచారని అన్నారు. ధర్మసాగరం ప్రాంతంలో సెజ్ (ప్రత్యేక ఆర్థిక మండలి) ఏర్పాటు చేసి నియోజకవర్గ ప్రజలకు పరిశ్రమలు, ఉద్యోగాలు కల్పిస్తానన్న బాబు హామీ ఏమైందని ప్రశ్నించారు. నర్సీపట్నంను అభివృద్ధి చేసి మోడల్ టౌన్గా తీర్చిదిద్దుతానన్న హామీని టీడీపీ ప్రభుత్వం తుంగలో తొక్కిందని చెప్పారు.