
ప్రతి కార్యకర్తకూ అండగా ఉంటాం
► రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి
► 35 డివిజన్ యువకులు వైఎస్సార్ సీపీలో చేరిక
నెల్లూరు(అగ్రికల్చర్) : వైఎస్సార్ సీపీలో చేరిన ప్రతి కార్యకర్తకూ అండగా ఉంటామని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి అన్నారు. నగరంలోని రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో స్థానిక 35వ డివిజన్ పొదలకూరు రోడ్డు సెంటర్కు చెందిన పలువురు యువకులు సోమవారం ఎమ్మెల్యే సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్లో చేరారు. నూతనంగా పార్టీలో చేరిన కార్యకర్తలకు కోటంరెడ్డి పార్టీ కండువాలు కప్పి సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పొదలకూరు రోడ్డుకు చెందిన పలువురు యువకులు వైఎస్సార్సీపీ 35వ డివిజన్ జాయింట్ సెక్రటరి చిన్నమస్తాన్ ఆధ్వర్యంలో పార్టీలో చేరడం శుభపరిణామమన్నారు. కష్టపడి పనిచేసే ప్రతి ఒక్కరికీ వైఎస్సార్ సీపీ అంగడా ఉంటుందని, వారికి తగిన గుర్తింపునిస్తుందన్నారు.
కార్యకర్తలు పార్టీ జెండాలకే పరిమితం కాకుండా సేవా కార్యక్రమాల్లో పాలు పంచుకోవాలన్నారు. ప్రజలతో మమేకమై పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు. ప్రజా సమస్యల పోరాటంలో ప్రజలను భాగస్వామ్యం చేసుకోవాలని, పార్టీ ప్రతిష్ట పెంచే విధంగా అలుపెరగని పోరాటాలు చేయాలని సూచించారు. తాను ఎమ్మెల్యేగా కార్యకర్తల అభ్యున్నతికి పాటుపడతానని తెలిపారు. కార్పొరేటర్ బొబ్బల శ్రీనివాస యాదవ్, వెల్లంటి ఎంపీటీసీ పాదర్తి సుధాకర్, జాఫర్, వెంకటేశ్వర్లు, హసీనా, షమీఉల్లా, షాహుల్, ఇర్ఫాన్, ఖలీల్, పట్రంగి అజయ్, యూత్ జిల్లా జనరల్ సెక్రటరీ కుమార్ హరికుమార్ పాల్గొన్నారు.