ప్రధాని, జీవోఎంకు 8,067 ఈ-మెయిళ్లు | 8.067 emails send to Prime minister,GoM : YSRCP | Sakshi

ప్రధాని, జీవోఎంకు 8,067 ఈ-మెయిళ్లు

Nov 4 2013 1:05 AM | Updated on Sep 2 2017 12:15 AM

ప్రధాని, జీవోఎంకు 8,067 ఈ-మెయిళ్లు

ప్రధాని, జీవోఎంకు 8,067 ఈ-మెయిళ్లు

వైఎస్సార్ కాంగ్రెస్ పిలుపు మేరకు నవంబర్ 1వ తేదీ రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజున ఆంధ్రప్రదేశ్‌ను సమైక్యంగా ఉంచాలని కోరుతూ 8,067 ఈ-మెయిళ్లను ప్రధానమంత్రికి, కేంద్ర మంత్రుల బృందానికి(జీవోఎం) పంపామని పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ కోఆర్డినేటర్ కొణతాల రామకృష్ణ, సభ్యుడు ఎం.వి.మైసూరారెడ్డి వెల్లడించారు.

సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పిలుపు మేరకు నవంబర్ 1వ తేదీ రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజున ఆంధ్రప్రదేశ్‌ను సమైక్యంగా ఉంచాలని కోరుతూ 8,067 ఈ-మెయిళ్లను ప్రధానమంత్రికి, కేంద్ర మంత్రుల బృందానికి(జీవోఎం) పంపామని పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ కోఆర్డినేటర్ కొణతాల రామకృష్ణ, సభ్యుడు ఎం.వి.మైసూరారెడ్డి వెల్లడించారు. ఆదివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో వారు విలేకరులతో మాట్లాడుతూ ఇప్పటివరకు 8,067 గ్రామపంచాయతీలు ఈ మేరకు తీర్మానాలు చేసి పంపాయని తెలిపారు. మైసూరా మాట్లాడుతూ.. సమైక్య తీర్మానాలు చేసిన గ్రామాలు ఇంకా ఎక్కువే ఉన్నాయని, ఈ-మెయిల్ చేయడానికి సౌకర్యం లేనందున తమకు పూర్తి సమాచారం రాలేదని చెప్పారు. ఈ నెల 7న జీవోఎం సమావేశమవుతున్నందుకు నిరసనగా 6, 7 తేదీల్లో 48 గంటలపాటు రహదారుల దిగ్బంధం చేయాలని పార్టీ ఇచ్చిన పిలుపును ఆయన మరోసారి గుర్తు చేశారు. కేంద్రానికి ఈ-మెయిళ్లు పంపడం వల్ల ప్రయోజనముంటుందా? అని ప్రశ్నించగా.. ప్రజాస్వామ్యంపై నమ్మకమున్న ప్రభుత్వమైతే తప్పక స్పందిస్తుందని మైసూరా వివరించారు.
 
 ప్రభుత్వమే ప్రేరేపించింది
 నల్లగొండ జిల్లాలో వరద బాధితులను పరామర్శించకుండా పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మను ప్రతిఘటించడం వెనుక రాష్ట్రప్రభుత్వమే ఉందని, మంత్రులు ప్రేరేపించడంతోనే ఇలా జరిగిందని కొణతాల దుయ్యబట్టారు. మంత్రులుగా ఉన్నవారే అడ్డుకోవాలని పిలుపునివ్వడం చాలా తప్పని, ఆ నియోజకవర్గాల్లో వారి పలుకుబడి క్షీణిస్తుంటే మాత్రం ఇలా చేయాలా? అని ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఇద్దరూ వరద ప్రాంతాలను సందర్శించి రాజకీయాలు మాట్లాడారు కానీ విజయమ్మ తన పర్యటనలో ఎక్కడా రాజకీయాలు మాట్లాడలేదని, అయినా ప్రభుత్వమే కావాలని అడ్డుకుందని కొణతాల విమర్శించారు. చంద్రబాబుకు మాత్రం పోలీసులు, మంత్రులే ఘనస్వాగతం పలికారన్నారు. ఖమ్మంలో విజయమ్మ పర్యటన విజయవంతంగా, ప్రశాంతంగా జరిగిందని, అందుకే నల్లగొండలో కావాలని అడ్డుకున్నారని చెప్పారు. ఇలాంటి అడ్డంకులవల్ల తమ పర్యటనలు ఆగవని, తమ ప్రయత్నాలు కొనసాగిస్తామని ఆయన దృఢంగా పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement