ఎన్నాళ్లకెన్నాళ్లకు.. | After one year, okatina DRC | Sakshi
Sakshi News home page

ఎన్నాళ్లకెన్నాళ్లకు..

Jan 31 2014 1:06 AM | Updated on Sep 2 2017 3:11 AM

ఎన్నాళ్లకెన్నాళ్లకు..

ఎన్నాళ్లకెన్నాళ్లకు..

అమాత్యులకు ఏడాది కాలానికి జిల్లా అభివృద్ధి సమీక్ష సమావేశం(డీఆర్సీ) గుర్తుకొచ్చింది. అనేక సమస్యలు జిల్లాను పట్టిపీడిస్తుంటే..

  •       ఏడాది తరువాత ఒకటిన డీఆర్సీ
  •      అధికారులను పరుగులు పెట్టిస్తున్న మంత్రులు
  •      ఆగమేఘాలమీద 15 అంశాలతో అజెండా రూపకల్పన
  • విశాఖ రూరల్, న్యూస్‌లైన్: అమాత్యులకు ఏడాది కాలానికి జిల్లా అభివృద్ధి సమీక్ష సమావేశం(డీఆర్సీ) గుర్తుకొచ్చింది. అనేక సమస్యలు జిల్లాను పట్టిపీడిస్తుంటే.. వాటిపై చర్చించేందుకు ఇప్పటికి వారికి తీరిక కుదిరింది. ఇప్పుడు కూడా ఎవరికి వారు తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించుకోడానికే ప్రయత్నిస్తున్నారు తప్పా.. జిల్లా అభివృద్ధి, ప్రజా సంక్షేమంపై ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నట్టు కనిపించడం లేదు.

    డీఆర్‌సీ నిర్వహణపై ఎవరికివారే ప్రకటనలు చేస్తూ అధికారులను పరుగులు పెట్టిస్తున్నారు. సుమారు 11 నెలల తరువాత డీఆర్‌సీని ఫిబ్రవరి ఒకటిన జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లా ఇన్‌చార్జి మంత్రి, రాష్ట్ర సహకార శాఖ మంత్రి కాసు వెంకట కృష్ణారెడ్డి అధ్యక్షతన ఉదయం 10 గంటలకు సమావేశం ప్రారంభమవుతుంది.
     
    11 నెలల తరువాత సమీక్ష
     
    తుపాన్లు, వరదలు జిల్లాను ముంచెత్తాయి. పంటలు నీట మునగడంతో వేలాది మంది రైతులు పెద్ద ఎత్తున నష్టపోయారు. ఈ పరిస్థితుల్లో కీలకమైన డీఆర్సీని నిర్వహించి, సమస్యలపై చర్చించి బాధితులను ఆదుకోవాల్సిన మంత్రులు రాజకీయాలు, పరస్పర ఆరోపణల్లో బిజీ అయిపోయారు. వాస్తవానికి ప్రతీ మూడు నెలలకోసారి డీఆర్‌సీ నిర్వహించాల్సి ఉంది. గతేడాది మార్చి 3న జరిగింది. మళ్లీ ఇప్పుడు ఈ సమీక్షను ఏర్పాటు చేస్తున్నారు.
     
    అధికారులు ఉరుకులూ పరుగులు...
     
    సాధారణంగా ఎప్పుడు డీఆర్సీ నిర్వహించినా.. కనీసం మూడు వారాలు ముందుగా జిల్లా ఇన్‌చార్జిమంత్రి నుంచి జిల్లా అధికారులకు సమాచారం ఉంటుంది. ఆమేరకు జిల్లా కలెక్టర్ అన్ని శాఖలతో సమావేశం నిర్వహించి అజెండా రూపొందిస్తారు. కానీ ఈసారి కేవలం 10 రోజుల వ్యవధిలోనే  డీఆర్‌సీకి ఏర్పాట్లు చేయాలని అమాత్యులు అధికారులను ఆదేశించారు. తొలుత ఈ నెల 19న ఈ సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. ఇంతలో అసెంబ్లీ సమావేశాలు గుర్తుకొచ్చి వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. మళ్లీ వచ్చేనెల ఒకటిన డీఆర్‌సీ ఉంటుం దని అయిదు రోజుల క్రితం సమాచారమిచ్చారు. దీంతో అజెండా తయారీలో అధికారులు నిమగ్నమయ్యారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement