
అగ్రిగోల్డ్ ఆస్తుల వేలం
- 18వ తేదీ వరకు ఆస్తుల ప్రదర్శన
- నేడు ప్రకటన వెలువరిస్తామన్న డీజీపీ
సాక్షి, అమరావతి: అగ్రిగోల్డ్ ఆస్తుల వేలానికి సంబంధించిన వేలం వివరాలను ఆదివారం పత్రికల ద్వారా ప్రకటన వెలువరించను న్నట్టు ఏపీ డీజీపీ సాంబశివరావు తెలిపారు. శనివారం విజయవాడలో విలేకరులతో మాట్లాడారు. మొత్తం రూ.280 కోట్ల విలువ గల ఆస్తులను ప్రస్తుతం వేలం వేస్తున్నట్టు చెప్పారు. సీల్డు కవరులో వచ్చిన అన్ని టెండర్లను ఈ నెల 26న హైకోర్టుకు పంపుతామని, 27న టెండర్లను తెరుస్తామని వివరించారు. ఆసక్తి కలిగిన వారు ఒక్కొక్క విభాగానికి ప్రభుత్వం నిర్ణయించిన ధరలో ఒక మొత్తాన్ని బిడ్ అమౌంట్గా చెల్లించి ఎలాంటి భయాందోళనలు లేకుండా వేలంలో పాల్గొనవచ్చని సూచించారు.
వేలంలో పాల్గొన దలచిన వారికి ఈ నెల 18వ తేదీ వరకు సీఐడీ అధికారులు ఆస్తులు చూపిస్తారని డీజీపీ తెలిపారు. గతంలో నిర్వహించిన వేలంద్వారా రూ.17 కోట్లు వచ్చినట్టు తెలిపారు. అగ్రిగోల్డ్ సంస్థ పేరిట బంగారం, వెండి, వాహనాలు, భవనాల వంటి చరాస్తులతోపాటు రాష్ట్రంలో 17 వేల ఎకరాల భూమి, కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు వంటి పొరుగు రాష్ట్రాల్లో మరో 3,200 ఎకరాల స్థిరాస్తులు ఉన్నాయని చెప్పారు.