
సాక్షి, అమరావతి: ‘ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై ఆయన అభిమానే కోడి కత్తితో దాడి చేశాడు.. ఆ కేసులో ఏముంది.. ఆ కేసు దర్యాప్తును ఎన్ఐఏకు అప్పగించడం రాష్ట్ర హక్కులను హరించడమే’నని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. రాష్ట్ర హక్కులను హరిస్తే కేంద్రాన్ని వదిలిపెట్టేది లేదన్నారు. మాజీమంత్రి అహ్మదుల్లా టీడీపీలో చేరిన సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. ఎన్నికలకు కేవలం వంద రోజుల సమయం మాత్రమే ఉందన్నారు. ఇంటికి ఒకరు చొప్పున టీడీపీ కోసం ప్రచారం చేయాలని.. 25 లోక్సభ స్థానాల్లోనూ టీడీపీనే గెలిపించాలని కోరారు.
చంద్రబాబు దావోస్ పర్యటన రద్దు
దావోస్ పర్యటనను సీఎం చంద్రబాబు రద్దు చేసుకున్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు గురువారం తెలిపాయి. ఆయనకు బదులుగా మంత్రులు యనమల రామకృష్ణుడు, నారా లోకేష్ నేతృత్వంలోని 15 మంది అధికారుల బృందం వెళ్లనుంది. ఈనెల 22 నుంచి 25 వరకూ అక్కడ జరిగే ప్రపంచ ఆర్థిక సదస్సులో ఆ బృందం పాల్గొననుంది.