
సాక్షి, అమరావతి: కళ్లకు క్యాన్సర్ సోకిన చిన్నారి హేమ అనారోగ్యంపై పత్రికల్లో వచ్చిన కథనంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పందించారు. తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం కడియపులంక గ్రామానికి చెందిన చిన్నారి హేమ అనారోగ్యంపై సీఎం జగన్ ఆరా తీశారు. చిన్నారి కుటుంబంతో మాట్లాడి, వైద్యం కోసం అవసరమైన ఏర్పాట్లు చేయాల్సిందిగా సంబంధిత అధికారులను సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు.
ఇలాంటి నిరుపేదలను పూర్తిస్థాయిలో ఆదుకోవడానికి ఆరోగ్యశ్రీలో భారీ సంస్కరణలు తీసుకురావడానికి గతంలోనే నిర్ణయం తీసుకున్నామని సీఎం వెల్లడించారు. క్యాన్సర్ రోగులకు ఆరోగ్యశ్రీ కింద ఎన్ని విడతలు చికిత్స అవసరమైనా చేయించాలని సీఎం స్పష్టం చేశారు. చికిత్సలో ఎన్ని సైకిల్స్ అవసరమైనా పూర్తి ట్రీట్మెంట్ అందిస్తున్నామని పేర్కొన్నారు. గతంలో మాదిరిగా కాకుండా ఆరోగ్యశ్రీ కింద క్యాన్సర్ రోగులకు ఏ పరిమితి లేకుండా చికిత్స అందింస్తున్నామని చెప్పారు. జనవరి 1 నుంచి ఇది అమల్లోకి వస్తోందని.. అత్యవసర కేసులు ఉంటే.. ఆ రోగులకు వెంటనే చికిత్సలు అందించాలని సీఎం జగన్ ఆదేశించారు.