
సాక్షి, ఏలూరు: మహిళలు తమ లక్ష్యాలను సాధించుకునేందుకు ‘దిశ’ చట్టం ఎంతో ఉపయోగపడుతుందని ఏలూరు సెయింట్ థెరిసా కళాశాల విద్యార్థినులు అన్నారు. దిశ చట్టంపై సాక్షి టీవీ నిర్వహించిన చర్చా కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థినులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. మహిళల్లో ఎదగాలని ఎంతో తపన ఉన్నప్పటికి అత్యాచార ఘటనల వల్ల అభద్రత భావానికి గురవుతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. సమాజంలో మార్పు తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడేవారిని వెంటనే శిక్షించాలని కోరారు. దిశచట్టం తో మహిళలపై దాడులు తగ్గుతాయనే నమ్మకం ఉందని ధీమా వ్యక్తం చేశారు. దిశ చట్టం దేశవ్యాప్తంగా అమలు చేయాలని కోరారు. దిశ చట్టం తీసుకురావడంతో అమ్మాయిల కన్నా.. అబ్బాయిల తల్లిదండ్రులే ఎక్కువ భయపడుతున్నారని వారు పేర్కొన్నారు. మహిళలందరి తరపున ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి సెయింట్ థెరిసా కళాశాల విద్యార్థినులు కృతజ్ఞతలు తెలిపారు.