
సాక్షి, అనపర్తి: కరోనా నేపథ్యంలో ప్రభుత్వం లాక్డౌన్ విధించి, మద్యం అమ్మకాలను కూడా నిషేధించింది. ఈ తరుణంలో మద్యం అమ్మకాలు జరగకుండా చూడాల్సి న ఎక్సైజ్ సీఐ కంచే చేను మేసిందన్న చందంగా మద్యం అక్రమ తరలింపునకు పాల్పడి, చివరకు సస్పెన్షన్ వేటుకు గురయ్యారు. అంతేకాకుండా ఆయనపై రూ.5 లక్షల జరిమానా విధించారు. మరోవైపు తూర్పుగోదావరి జిల్లా రాయవరం ఎక్సైజ్ సీఐ రెడ్డి త్రినాథ్ మద్యం అక్రమ తరలింపు వ్యవహారంపై మంత్రి నారాయణ స్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్సైజ్ సీఐపై సస్పెన్షన్ వేటు వేయడమే కాకుండా, రూ.5 లక్షల జరిమానా విధించినట్లు ఆయన తెలిపారు. మంత్రి నారాయణస్వామి మాట్లాడుతూ ఎక్సైజ్ సీఐ త్రినాథ్ అక్రమంగా మద్యం తరలించారని, అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
వివరాలలోకి వెళితూ.. కుతుకులూరు మారుతీనగర్లోని ప్రభుత్వ మద్యం దుకాణానికి సీల్ వేయాలంటూ రాయవరం ఎక్సైజ్ సీఐ రెడ్డి త్రినాథ్రావు ఆదివారం అక్కడికి వచ్చారు. సీఐ వాహనంతో పాటు, ఇంకా రిజిస్ట్రేషన్ కాని వాహనంలో మరికొందరు వచ్చారు. రూ.1.5 లక్షల మద్యం బాటిళ్లను ఆ వాహనాల్లో తరలించే ప్రయత్నం చేశారు. తమకు ఇబ్బంది అవు తుందని షాపు సూపర్వైజర్లు జె.శేఖర్, షేక్ మౌషీ చె ప్పినా తాను చూసుకుంటానంటూ సీఐ మద్యం బాటిళ్లను వాహనాల్లో వేశారు. స్థానికులు అడ్డుకోబోగా సీఐ సొంత వాహనాన్ని డ్రైవర్ అక్కడి నుంచి వేగంగా తరలించాడు. మద్యం సీసాలతో మరో వాహనాన్ని స్థానికులు అడ్డుకుని అనపర్తి పోలీస్ స్టేషన్కు తరలించారు.
కఠిన చర్యలు తీసుకోవాలి : ఎమ్మెల్యే
విషయం తెలిసి, ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్య నారాయ ణరెడ్డి సంఘటన స్థలానికి చేరుకున్నారు. మద్యం అక్ర మ తరలింపుపై సీఐ త్రినాథ్ను నిలదీశారు. తనకు ఎ టువంటి సంబంధం లేదని, గ్రామంలో మద్యం తరలింపుపై సమాచారం రావడంతోనే తాను వచ్చానని, షాపు సూపర్వైజర్ల మాటల్లో వాస్తవం లేదని సీఐ చెప్పారు. దీనిపై ఎమ్మెల్యే ఎక్సైజ్ ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. కాగా సీఐ త్రినాథ్ను సస్పెండ్ చేస్తూ ఎక్సైజ్ సూపరింటిండెంట్ ప్రభుకుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ ప్రశ్నలకు బదులేది సీఐ సారూ?
షాపునకు సీలు వేసేందుకు వస్తే సీఐ వాహనం వెంట మరో వాహనం ఎందుకు వచ్చింది? స్థానికులు ప్రశ్నిస్తే కారులో ఉన్న వారు ఎక్సైజ్ సీఐ సెల్కు ఎందుకు ఫోన్ చేశారు? సీఐ ఆదేశం లేకుండా మద్యం బాటిళ్లు కారులోకి ఎలా వెళ్లాయి? అక్రమంగా మద్యం దొరికితే రెవెన్యూ అధికారుల పర్యవేక్షణలో పంచనామా జరగకుండానే తన కార్యాలయానికి హడావుడిగా ఎందుకు తరలించారనే ప్రశ్నలకు సీఐ జవాబు చెప్పాల్సి ఉంది.