
ఇక చంద్రబాబుకు సింగపూరే గతి!: గట్టు
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల ఫలితాల తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబు బిచాణా ఎత్తేసి సింగపూర్కు వెళ్లిపోవడం ఖాయమని, ఆయన తిరిగి ఎప్పటికీ కోలుకోలేని రీతిలో ఫలితాలు రాబోతున్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు వ్యాఖ్యానించారు. మే 16న వెలువడే ఫలితాల్లో తమ పార్టీ సీమాంధ్రలో కింగ్, తెలంగాణలో కింగ్ మేకర్ అవుతుందని.. చంద్రబాబునాయుడు, వెంకయ్యనాయుడు, పవన్కల్యాణ్, ఎల్లో మీడియా కలిసి దుష్ట చతుష్టయంగా ఏర్పడి ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా పనిచేయలేదని విమర్శించారు. ఇప్పటికే ఓటమికి గల మార్గాలను వెతుక్కునే పనిలో చంద్రబాబు నిమగ్నమై ఉన్నారని ఎద్దేవా చేశారు. గురువారం హైదరాబాద్లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో గట్టు రామచంద్రరావు విలేకరులతో మాట్లాడారు.
ఇప్పుడు నరేంద్ర మోడీ, పవన్ను మెచ్చుకుంటున్న చంద్రబాబు.. ఎన్నికల ఫలితాల తర్వాత వారిని కచ్చితంగా విమర్శిస్తారని.. వారి వల్లే ఓడిపోయానని బాబు చెప్పడం ఖాయమని పేర్కొన్నారు. తాను చేసే తప్పులన్నీ ఇతరులపై నెట్టడం బాబుకు అలవాటుగా మారిందని విమర్శించారు. దాడులకు పాల్పడుతూ, దొంగ నోట్లు, మద్యం పంచుతూ టీడీపీ నేతలే పట్టుబడితే.. తీవ్ర ఒత్తిడిలో ఉన్న బాబు మాత్రం తమపై ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు.
ఎల్లో మీడియా రాసిన కథనాలను ప్రతీ ఒక్కరూ నమ్మాలని, వారు చేసే ప్రతి పనికి మీడియా సంఘాలు మద్దతివ్వాలని అంటూ బాబు అడ్డగోలు వాదన చేస్తున్నారని గట్టు మండిపడ్డారు. ఈ సందర్భంగా సీమాంధ్రలోని పలు ప్రాంతాల్లో టీడీపీ నేతలు చేసిన దాడుల వివరాలను మీడియాకు వెల్లడించారు. టీడీపీ నేతల వద్ద కోట్ల రూపాయలు పట్టుబడినా సమాధానం ఉండదన్నారు. చంద్రబాబు ఎన్ని కుయుక్తులు పన్నినా మే 16 తర్వాత కాలగర్భంలో కలిసిపోవడం ఖాయమని జోస్యం చెప్పారు. ఇక పక్కవాడికోసం పార్టీ పెట్టిన ఘనత పవన్ కల్యాణ్దేనని, ఆయన కూడా మే 16 తర్వాత కనుమరుగవడం ఖాయమని గట్టు పేర్కొన్నారు.