పత్తికొండ అర్బన్
పత్తికొండలోని రెవెన్యూ కార్యాలయంలో విద్యార్థులు, రైతులు అందజేసిన దరఖాస్తులకు మోక్షం లభించడం లేదు. ఎంకిపెళ్లి సుబ్చిచావుకొచ్చిందన్నట్లుగా తహశీల్దారు బదిలీ విద్యార్థులు, రైతులకు తలనొప్పిగా మారింది.
సమైక్యాంధ్ర ఉద్యమ కాలంలో పెండింగ్లో పడిన వందలాది అప్లికేషన్లు ఇటీవలే పూర్తి చేశారు. పత్తికొండ తహశీల్దారుగా పనిచేసిన రామక్రిష్ణ ఈనెల 23న సన్మానం ముగించుకుని కడప జిల్లాకు బదిలీపై వెళ్లారు. విద్యార్థులు స్కాలర్షిప్ల కోసం కుల, నివాస, ఆదాయ ధృవీకరణ పత్రాల కోసం దరఖాస్తు చేసుకున్నారు.
గతంలో అందజేసిన దరఖాస్తులు కొన్ని పెండింగ్లో పడగా మరికొన్ని వాటికి జత చేరాయి. స్కాలర్షిప్ రెన్యూవల్ గడువు ముగుస్తుందని కళాశాల, పాఠశాలల సిబ్బంది విద్యార్థులపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. దీంతో విద్యార్థులు మీసేవ కేంద్రాలు, తహశీల్దారు కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. చేసేదేమీ లేక నిరాశతో వెనుదిరిగి వెళ్తున్నారు.
దీంతో సుమారు 300పైగా దరఖాస్తులకు పెండింగ్లో పడినట్లు రెవెన్యూ సిబ్బంది తెలిపారు. బదిలీల కారణంగా నూతన తహశీల్దారు పేరుమీద డిజిటల్ కీ సంతకం నమోదు కాకపోవడం వల్ల సమస్య తలెత్తినట్లు తెలిసింది.
ఒక్కరోజులో పరిష్కరిస్తాం:
శివరామయ్య, తహశీల్దారు పత్తికొండ
కొత్తగా బాధ్యతలు తీసుకున్నా. వచ్చి రెండురోజులే అయింది. ఆర్డీఓ, జిల్లా స్థాయి ఉన్నతాధికారులకు రిపోర్ట్ చేసుకోవడానికి ఒకరోజు గడిచిపోయింది. సాంకేతిక కారణాలతో కొంత జాప్యం జరిగిన మాట వాస్తవమే. వీఆర్ఓల సమావేశం ఏర్పాటు చేసి ఒకరోజులో దరఖాస్తుల జారీకి చర్యలు తీసుకుంటాం.