ఎక్కడి నుంచైనా స్విచ్చాఫ్‌ | Hi-tech smart meters in government offices soon | Sakshi
Sakshi News home page

ఎక్కడి నుంచైనా స్విచ్చాఫ్‌

Published Tue, Mar 10 2020 5:46 AM | Last Updated on Tue, Mar 10 2020 5:46 AM

Hi-tech smart meters in government offices soon - Sakshi

సాక్షి, అమరావతి: ప్రభుత్వ కార్యాలయాల్లో విద్యుత్‌ వృథాను అరికట్టేందుకు వీలుగా హైటెక్‌ ఫీచర్లతో స్మార్ట్‌ మీటర్లు ఏర్పాటు చేసేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. చేతిలో ఉన్న సెల్‌ఫోన్‌తో ఓ క్లిక్‌ ఇస్తే సరి.. ఆఫీస్‌లోని మెయిన్‌ స్విచ్‌ ఆగిపోతుంది. మళ్లీ మీరు ఆన్‌ చేసే వరకూ ఏ లైటూ వెలగదు. ఈ తరహా టెక్నాలజీని ఏపీ విద్యుత్‌ సంస్థలు అందుబాటులోకి తెస్తున్నాయి. మూడేళ్లలో వినియోగదారులకూ అందుబాటులోకి తీసుకురానున్నారు. 

హైటెక్‌ స్మార్ట్‌ మీటర్‌ పనితీరు ఇలా..
- స్మార్ట్‌ మీటర్‌లో ఓ ఎలక్ట్రానిక్‌ చిప్‌ అమరుస్తారు. మీ సెల్‌ఫోన్‌లో డౌన్‌లోడ్‌ చేసుకునే యాప్‌కు చిప్‌ సిగ్నల్స్‌ పంపుతుంది. ఇంకా చెప్పాలంటే రిమోట్‌లా పనిచేస్తుంది. 
- ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ (ఐవోటీ) ఆధారంగా పనిచేసే చిప్‌కు ఆఫీస్‌లో ప్రత్యేకంగా ఇంటర్నెట్‌ అవసరం లేదు. మీ మొబైల్‌లో నెట్‌ సౌకర్యం ఉంటే చాలు. 
- మొబైల్‌ యాప్‌ ఓపెన్‌ చెయ్యగానే స్మార్ట్‌ మీటర్‌ దగ్గర చిప్‌ ఆఫీస్‌లో కరెంట్‌ పరిస్థితిని తెలియజేస్తుంది. విద్యుత్‌ ఉందా? లేదా? అనే విషయం ఇట్టే 
తెలుసుకోవచ్చు. 
- ఆఫీస్‌లో ఎంత లోడ్‌ ఉందో చిప్‌ సమాచారమిస్తుంది. లోడ్‌ను బట్టి ఏయే ఉపకరణాలు ఆన్‌లో ఉన్నాయనే విషయాలు గమనించవచ్చు.  
- అనవసరంగా ఉపకరణాలు వెలుగుతుంటే మొబైల్‌ యాప్‌లో ఆఫ్‌ బటన్‌ క్లిక్‌ చేస్తే మెయిన్‌ ద్వారా విద్యుత్‌ ఆగిపోతుంది.  

ఎప్పటి నుంచి... ?
- హైటెక్‌ స్మార్ట్‌ మీటర్ల పరిశీలన ప్రక్రియ దాదాపు పూర్తయింది. ఏప్రిల్‌లో టెండర్లు పిలిచే వీలుందని అధికారులు చెప్పారు.  
ఒక్కో మీటర్‌ రూ. 4 నుంచి రూ. 7 వేల వరకూ ఉంటుందని అంచనా వేస్తున్నారు. 
- అతి తక్కువ ధరకు అమర్చే సంస్థనే ఎంపిక చేయాలనే లక్ష్యంతో విద్యుత్‌ సంస్థలున్నాయి.  
- ప్రక్రియ పూర్తయి, మీటర్ల తయారీ జరిగితే మే నాటికి ప్రభుత్వ కార్యాలయాలకు, వచ్చే మూడేళ్లలో వినియోగదారులకూ హైటెక్‌ స్మార్ట్‌ మీటర్లు బిగించే వీలుంది.  

ఇంకా ఉపయోగాలేంటి 
- టైమర్‌ సౌకర్యం కూడా స్మార్ట్‌ మీటర్‌లో ఉంటుంది. అంటే ఎప్పుడు లైట్లు ఆగిపోవాలో యాప్‌ ద్వారా టైం సెట్‌ చేసుకుంటే సరిపోతుంది. 
- ఏ రోజున ఎంత విద్యుత్‌ వాడుకోవాలనే విషయం ఇక మన చేతుల్లోనే ఉంటుంది. యాప్‌లో ఆప్షన్‌ సెలక్ట్‌ చేసుకుంటే వాడకం పరిమితి తర్వాత విద్యుత్‌ సరఫరా ఆగిపోతుంది. దీనివల్ల అధిక బిల్లులను నియంత్రించే వీలుంది. 
- నెలకు ఎంత బిల్లు వస్తుందనేది ఎప్పటికప్పుడు చెక్‌ చేసుకోవచ్చు. నెలవారీ బిల్లును కూడా యాప్‌ ద్వారానే ఆటోమేటిక్‌గా చెల్లించుకునే వీలుంది. బ్యాంక్, పేటీఎం, ఇతర యాప్‌లకు లింక్‌ అయితే 
సరిపోతుంది.  
- కరెంట్‌ హెచ్చు తగ్గుల వివరాలూ స్మార్ట్‌ మీటర్‌ ద్వారా రికార్డవుతాయి. నాణ్యమైన విద్యుత్‌ అందనప్పుడు, అంతరాయాల వల్ల ఉపకరణాలు దెబ్బతిన్నప్పుడు పంపిణీ సంస్థను ప్రశ్నించేందుకు కచ్చితమైన 
ఆధారాలుంటాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement