వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న'సమైక్య శంఖారావం' సభకు తెలంగాణ జిల్లాల నుంచి పార్టీ కార్యకర్తలు భారీగా తరలి వస్తున్నారు.
ఏకపక్షంగా రాష్ట్ర విభజనను చేపట్టారని, అన్ని ప్రాంతాలకు న్యాయం జరిగేలా రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న'సమైక్య శంఖారావం' సభకు తెలంగాణ జిల్లాల నుంచి పార్టీ కార్యకర్తలు భారీగా తరలి వస్తున్నారు. మహబూబ్ నగర్, ఖమ్మం జిల్లాల నుంచి కార్యకర్తలు పెద్ద ఎత్తున శనివారం హైదరాబాద్ చేరుకున్నారు. ఆయా జిల్లాల్లో అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి కార్యకర్తలు స్వచ్ఛందంగా తరలి వచ్చారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం కాదని, అయితే అన్ని ప్రాంతాల ప్రజలతో చర్చించి తగు నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నట్లు వారు తెలిపారు.
మరోవైపు సమైక్య శంఖారావానికి వెళుతున్న సమైక్యవాదులను ...ఆందోళనకారులు అడ్డుకోకుండా పోలీసులు బందోబస్తు చేపట్టారు. 44వ జాతీయ రహదారిపై అలంపూర్ చౌరస్తా నుంచి కొత్తూరు వరకూ పోలీసులు మోహరించారు. అలంపూర్, గద్వాల, మదనాపురం, మహబూబ్నగర్, జడ్చర్ల, షాద్ నగర్ తదితర రైల్వేస్టేషన్లలో పోలీసులు నిన్న సాయంత్రం నుంచే పహరా నిర్వహిస్తున్నారు.