ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి
నెల్లూరు(హరనాథపురం): ఏ ఒక్క అర్హుడికి అన్యాయం జరిగినా ఊరుకోనని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి స్పష్టం చేశారు. పడారుపల్లిలోని మున్సిపల్ స్కూల్లో 24వ డివిజన్, కల్లూరుపల్లిలో 25వ డివిజన్లకు సంబంధించిన జన్మభూమి కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా వృద్ధులకు పింఛన్లు, గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారాన్ని పంపిణీ చేశారు. బాలింతలను దీవించి ప్రత్యేక సారెను అందజేశారు. స్థానికులు ఏర్పాటు చేసిన వైద్యశిబిరాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. పింఛన్ల మంజూరులో అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, అర్హులకు మంజూరు చేయాలని కోరారు. జన్మభూమి అనంతరం నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల్లో పర్యటించి ప్రజాసమస్యలను తెలుసుకుంటామని చెప్పారు. మరుగుదొడ్ల నిర్మాణం కోసం రూ.12 వేలను ప్రభుత్వం మంజూరు చేస్తోందని, ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆయా ప్రాంతాల్లో పారిశుధ్య మెరుగునకు ప్రజల భాగస్వామ్యం, సహకారం అవసరమని, ప్రజలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అర్జీ తీసుకొని అధికారుల దగ్గరకు వచ్చిన ప్రజలను ఆదరించాలని, సత్వరమే పరిష్కారమయ్యే సమస్యలకు వెంటనే పరిష్కారం చూపాలని సూచించారు. పరిష్కారం లభించని సమస్యలకు కారణాలను తెలియజేయాలన్నారు. 24, 25వ డివిజన్ల కార్పొరేటర్లు పాతపాటి శ్రీలక్ష్మి, బిరదవోలు పద్మజ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాతపాటి పుల్లారెడ్డి, మస్తాన్రెడ్డి, మల్లికార్జునరెడ్డి, నన్నం శ్రీనివాసులు, అన్నపురెడ్డి శేఖర్, వేల్పుల అజయ్, అరవ శ్రీను, శ్రీధర్రెడ్డి, లింగమూర్తి, తదితరులు పాల్గొన్నారు.
మినరల్ వాటర్ ప్లాంట్కు
*50 వేల విరాళం
కల్లూరుపల్లిలో జరిగిన జన్మభూమిలో స్థానిక కార్పొరేటర్ బిరదవోలు పద్మజ మాట్లాడారు. అల్లూరు ఆదినారాయణరెడ్డి సహకారంతో తమ డివిజన్లో మినరల్ వాటర్ ప్లాంట్ను ఏర్పాటు చేయబోతున్నామని ప్రకటించారు. దీనికి స్పందించిన ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి తమ వంతుగా రూ. 50 వేల సొం త నిధులను ఇస్తున్నట్లు ప్రకటించారు.