
సాక్షి, విజయవాడ: విజయవాడలోని ఓ రెస్టారెంట్లో చికెన్ బిర్యానీలో బల్లి రావడం కలకలం రేపుతోంది. రెస్టారెంట్ నిర్వాహకుల నిర్లక్ష్యం వలనే ఇలా జరిగిందని బాధితులు చెబుతున్నారు. ఈ సంఘటన నగరంలోని టీచర్స్ కాలనీలోని ఓ రెస్టారెంట్లో శుక్రవారం చోటుచేసుకుంది. బల్లి పడిన చికెన్ బిర్యానీ తిని ఇద్దరు వ్యక్తులు అస్వస్థతకు గురయ్యారు. బిర్యానీ తిన్న వారు వాంతులు చేసుకోవడంతో వారిని చికిత్స నిమిత్తం దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. రెస్టారెంట్ సిబ్బంది నిర్లక్ష్యంపై బాధితులు అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో అక్కడికి చేరుకున్న అధికారులు బల్లిపడిన చికెన్ బిర్యానీని స్వాధీనం చేసుకున్నారు.
ఫుడ్ సేఫ్టీ అధికారులు బల్లి పడిన బిర్యానీ వడ్డించిన రెస్టారెంటుని పరిశీలించారు. రెస్టారెంట్లోని వంటశాల తనిఖీ చేశారు. అపరిశుభ్ర వాతావరణంలో ఆహార పదార్ధాలను తయారీ చేస్తున్నట్లు నిర్ధారించారు. అధికారులు ఆహార పదార్ధాల శాంపిళ్లను సేకరించి, రెస్టారెంట్ను తాత్కాలికంగా సీజ్ చేశారు.