
అనుమానం పెనుభూతమై..
అనుమానం పెనుభూతమైంది.
- వివాహిత దారుణహత్య
- పరారీలో భర్త, అతని అక్క మొగుడు
- మాధవనగర్లో సంఘటన
కర్నూలు: అనుమానం పెనుభూతమైంది. జీవితాంతం తోడుంటానని అగ్ని సాక్షిగా ప్రమాణం చేసిన భర్తే ఆమెను కిరాతకంగా హత్య చేశాడు. బుధవారం సాయంత్రం మాధవనగర్లోని శివరామాలయం వెనుక వీధిలో పల్లవి (25) అనే వివాహిత దారుణహత్యకు గురైంది. స్థానికులు, పోలీసుల వివరాల మేరకు.. చిత్తూరు జిల్లా మదనపల్లె మండలం సీపీ సముద్రం గ్రామానికి చెందిన ఉమాదేవి, చంద్ర మౌళీశ్వరుల ఏకైక కుమార్తె పల్లవితో 2010లో పాములపాడు మండలం మిట్టకందాల గ్రామానికి చెందిన లక్ష్మిదేవి కుమారుడు పురోహితుడైన చంద్రమోహన్కు వివాహమైంది. ఏకైక కుమార్తె కావడంతో ఆమె విడిచి ఉండలేక తండ్రి.. జొహరాపురంలో పౌరోహిత్యం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో మాధవనగర్లో కాపురం పెట్టిన చంద్రమోహన్, పల్లవి దంపతులు ఏడేళ్ల పాటు కుటుంబాన్ని సజావుగా సాగించారు. చంద్రమోహన్ తల్లి లక్ష్మిదేవి కూడా వీరితో పాటే కలిసి ఉంది.
అనుమానంతోనే...
జూన్ 26న జరిగిన సంఘటనను పల్లవి భర్త చంద్రమోహన్కు తెలియజేశారు. నాటి నుంచి అనుమానం పెంచుకున్న భర్త, అతని బావ తరచూ పల్లవిని వేధింపులకు గురి చేసేవారు. ఒకానొక సమయంలో కాల్చి వాతలు కూడా పెట్టారని స్థానికులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం ఒంటరిగా ఉన్న పల్లవిని భర్త, అతని బావ దారుణంగా హత్య చేసి పరారయ్యారని మృతురాలి తల్లిదండ్రులు ఉమాదేవి, చంద్రమౌళీశ్వర్లు పోలీసుల ముందు వాపోయారు. మృతురాలికి కుమార్తె ఆరాధ్య, కుమారుడు కౌషిక్లు ఉన్నారు. మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు సీఐ శ్రీనివాసరావు సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు దర్యాప్తు చేపట్టారు.
జూన్ 26 ఏం జరిగింది?
గత నెల 26న చంద్రమోహన్ మొక్కు తీర్చుకునేందుకు తిరుపతికి వెళ్లాడు. అదే రోజు రాత్రి పల్లవి తల్లితో పాటు ఆమె బంధువులు ఇంటికొచ్చారు. అదే సమయంలో చంద్రమోహన్ తల్లి లక్ష్మిదేవి పెద్దమార్కెట్ వద్ద ఉన్న తన కుమార్తె వసుంధర వద్దకు పిల్లల్ని తీసుకెళ్లింది. ఒకేరోజు తల్లీపిల్లలు ఇంటికి రావడంతో అనుమానం వచ్చిన వసుంధర, ఆమె భర్త శేఖర్.. చంద్రమోహన్ ఇంటి వద్దకు వచ్చి తలుపు తట్టారు. ఇంట్లో పల్లవి తన బంధువులతో కలిసి ఉన్న దృశ్యాలను చూసిన వసుంధర, శేఖర్లు తమ అమ్మను, పిల్లల్ని పంపించి మీ బంధువులతో ఏం చేస్తున్నావంటూ దాడికి దిగారు. ఇరుగుపొరుగు వారు వచ్చి వారించడం తో ఆ రాత్రికి గొడవ సద్దుమణిగింది.