సీమాంధ్రలోని 13జిల్లాల్లో 20 రోజులుగా మహోద్యమం జరుగుతుంటే ప్రధాని మన్మోహన్సింగ్ స్పందించకపోవడం దారుణమని రాయలసీమ కార్మిక కర్షక సేవా సమితి అద్యక్షుడు సీహెచ్ చంద్రశేఖర్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
రాయలసీమ కార్మిక కర్షక సేవా సమితి అధ్యక్షుడు సీహెచ్ చంద్రశేఖర్రెడ్డి
కడప, న్యూస్లైన్: సీమాంధ్రలోని 13జిల్లాల్లో 20 రోజులుగా మహోద్యమం జరుగుతుంటే ప్రధాని మన్మో హన్సింగ్ స్పందించకపోవడం దారుణమని రాయలసీమ కార్మిక కర్షక సేవా సమితి అద్యక్షుడు సీహెచ్ చంద్రశేఖర్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కడప కలెక్టరేట్ ఎదుట ఆమరణ నిరాహార దీక్షచేస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ నాయకులకు ఆయన సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా సీహెచ్ మాట్లాడుతూ విభజన వల్ల సమస్యలు చాలా జఠిలమవుతాయన్నారు. తెలుగువారి ఐక్యతకు ఉన్న చారిత్రక నేపధ్యం తెలుసుకోకుండా మాట్లాడటం తెలంగాణ వాదులకు తగదని హితవు పలికారు.
రాయలసీమ వాసులు ప్రపంచంలో ఎవరూ చేయని విధంగా కృష్ణా-పెన్నార్ ప్రాజెక్టును కర్నూలు రాజధానిని త్యాగం చేశారన్నారు. విభజన వల్ల మిగులు జలాలపై ఆధారపడి నిర్మించిన రాయలసీమలోని తెలుగుగంగ, గాలేరు-నగరి, హంద్రీ-నీవా, చిత్రావతి, తెలంగాణలోని కల్వకుర్తి, నెట్టెంపాడు, ఎస్ఎల్బీసీ వంటి ప్రాజెక్టులకు ఒక్క చుక్కకూడా నీరు రాదన్నారు. ఫలితంగా రాయలసీమ, దక్షిణ తెలంగాణ, రాపూరు, నెల్లూరు ప్రాంతాలు శాశ్వత ఎడారిగా మారుతాయని హెచ్చరించారు. ఈ సమస్య పరిష్కరించబడాలంటే 18 జిల్లాలతో ఒక రాష్ట్రం, ఏడు జిల్లాలతో తెలంగాణ ఇవ్వడమే మార్గమన్నారు. కరువు ప్రాంతాల గోడుపై ఎక్కడా చర్చ జరగడం లేదని, పత్రికలు కూడా ఈ ప్రాంత ప్రజల ఆవేదనను ఎత్తిచూపడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 23 జిల్లాలను దృష్టిలో పెట్టుకుని హైదరాబాదును దేశంలోనే పేరుగాంచే విధంగా అభివృద్ది చేశారన్నారు. రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ పునరాలోచన చేయకపోతే ప్రజాగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు.