
సాక్షి, అమరావతి: నిబంధనలు ఉల్లంఘించిన ప్రైవేటు జూనియర్ కళాశాలలపై చర్యలు తీసుకుంటున్నామని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో చాలా కళాశాలలు చట్టవిరుద్ధంగా నడుస్తున్నాయని తెలిపారు. కోచింగ్లు పేరుతో పెడుతున్న బోర్డులను కళాశాల యాజమాన్యాలు వెంటనే తొలగించాలన్నారు. 699 కాలేజీల బోర్డులను తొలగించామని..1300 కాలేజీలకు 10 రోజులు డెడ్లైన్ పెట్టామని వెల్లడించారు. అన్ని కళాశాలల బోర్డులు ఒకేవిధంగా ఉండాలని మంత్రి పేర్కొన్నారు. ఆటస్థలాలు, ల్యాబ్లు లేకుండా కాలేజీలు నడుపుతున్న యాజమాన్యాలపై చర్యలు తీసుకుంటామన్నారు. కళాశాలలకు ఫైర్ సర్టిఫికెట్లు తప్పనిసరిగా ఉండాలని లేకపోతే చర్యలు చేపడతామన్నారు.
ఇంటర్ సిలబస్లో కూడా మార్పులు తీసుకొస్తాం..
2013 తరువాత ఇంటర్ బోర్డ్ సమావేశం కూడా నిర్వహించని దుస్థితి ఏర్పడిందని మంత్రి ఆదిమూలపు అన్నారు. ఇంటర్ సిలబస్లో కూడా మార్పులు తీసుకొస్తామన్నారు. కాంట్రాక్ట్ లెక్చరర్లు క్రమబద్దీకరణకు ఉపసంఘం వేశామని చెప్పారు. శాశ్వత ఉద్యోగాలను భర్తీ చెయ్యడానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. కార్పొరేట్ కళాశాలలు 50 వేలు నుండి 2.50 లక్షలు ఫీజులు వసూళ్లు చేస్తున్నాయని.. వాటిపై రెగ్యులేటరీ కమిషన్ చర్యలు తీసుకుంటుందన్నారు. ప్రైవేట్ హాస్టళ్ల చట్టాన్ని కూడా సవరిస్తామని తెలిపారు. ఫిర్యాదులు ఆన్లైన్లో పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని.. సమస్యలుంటే ఇంటర్ విద్యార్థులు ourbieap@gmail.com, 9391282578 నెంబరుకు ఫిర్యాదు చేయొచ్చని మంత్రి ఆదిమూలపు సురేష్ సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment