
సాక్షి, నెల్లూరు: కృష్ణా జలాల వినియోగంపై కొన్ని పార్టీలు రాజకీయం చేయడం సరికాదని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ హితవు పలికారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ ఏడాది 800 టీఎంసీల నీరు సముద్రం పాలైందన్నారు. వరద నీటిని సద్వినియోగం చేసుకునేందుకే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని 80 వేల క్యూసెక్కులకు పెంచాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయించారని.. ఇందుకోసం రూ.7 వేల కోట్లతో పాలనాపరమైన అనుమతులను ఇచ్చారని వివరించారు. కృష్ణాకు సగటున 30 రోజుల పాటు మాత్రమే వరద వస్తోందని.. ఈ సమయంలోనే నీటిని పూర్తిగా వాడుకోవాలని చెప్పారు.
(గ్యాస్ లీక్ ఘటనపై సీఎం జగన్ సమీక్ష)
‘‘నీటి వినియోగం కృష్ణా రివర్ మెనేజ్మెంట్ బోర్డ్ ప్రకారమే ఉంటుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల మధ్య చక్కటి సంబంధాలున్నాయి. గోదావరి, కృష్ణా జలాల అనుసంధానంపై పరస్పరం చర్చించి నిర్ణయాలు తీసుకుంటారు. కరోనా వల్ల సమావేశాలు ఆలస్యమయ్యాయని’’ ఆయన పేర్కొన్నారు. రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం, కృష్ణా, గుంటూరు జిల్లాల పరిధిలో కృష్ణా నీటిని పూర్తి స్థాయిలో వినియోగించుకునేందుకు ప్రణాళిక ప్రకారం పని చేస్తున్నామని మంత్రి అనిల్కుమార్ యాదవ్ తెలిపారు.
(విశాఖ గ్యాస్ లీక్ బాధితులకు చెక్కుల పంపిణీ)