తెలంగాణ రాజకీయ జేఏసీ ఆధ్వర్యం లో జిల్లాలో ముల్కీ అమరుల వారోత్సవాలు నిర్వహించనున్నారు. మూడు డిమాండ్లు, ఓ విజ్ఞప్తితో కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : తెలంగాణ రాజకీయ జేఏసీ ఆధ్వర్యం లో జిల్లాలో ముల్కీ అమరుల వారోత్సవాలు నిర్వహించనున్నారు. మూడు డిమాండ్లు, ఓ విజ్ఞప్తితో కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఆదివారం నుంచి ఈ నెల 7 వరకు తెలంగాణ ముల్కీ అమరుల స్మృత్యార్థం వారోత్సవాలు నిర్వహించనున్నట్లు రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ ఇటీవల ప్రకటించా రు. ఇందులో భాగంగా జిల్లాలోనూ శాంతి ర్యాలీలు నిర్వహించేలా రాజకీయ జేఏసీ, తె లంగాణవాదులు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లా లో ముల్కీ అమరుల వారోత్సవాల ఠ మొదటి పేజీ తరువాయి
సందర్భంగా శాంతి ర్యాలీలు ఘనంగా నిర్వహించేందుకు తెలంగాణవాదులు కూడా సన్నద్ధమయ్యారు.
భారీగా ఏర్పాట్లు..
1952 సెప్టెంబర్ 3, 4 తేదీల్లో జరిగిన ముల్కీ ఉద్యమంలో నాన్ ముల్కీలను బయటకు పంపించి ముల్కీలకే ఉద్యోగాలు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా జరిగిన ఉద్యమంలో పలువురు పోలీసు కాల్పుల్లో అమరులయ్యారు. ఈ నేపథ్యంలో వారిని స్మరించుకుంటూ జిల్లాలో వారోత్సవాలు నిర్వహించి ప్రజల వద్దకు వెళ్లేందుకు కార్యాచరణ ప్రకటించారు. ఈ క్రమంలోనే ఆదివారం నుంచి ఈ నెల 7 వరకు నిర్వహించేందుకు ఏర్పాట్లు సాగుతున్నాయి. ఈ నెల 1 నుంచి 6 వరకు తెలంగాణలోని పది జిల్లాల్లో ర్యాలీలు, దీక్షలు, 7న హైదరాబాద్లో శాంతి ర్యాలీ చేపట్టనున్నారు.
మూడు డిమాండ్లు.. ఓ విజ్ఞప్తి..
ముల్కీ అమరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా రాజకీయ జేఏసీ తెలంగాణ ప్రజల తరఫున మూడు డిమాండ్లు, ఓ విజ్ఞప్తిని ప్రభుత్వం, రాజకీయ పార్టీల దృష్టికి తీసుకెళ్లనుంది. మొదటి డిమాండ్ హైదరాబాద్తో కూడిన పది జిల్లాల తెలంగాణ రాష్ర్టం. దీనిపై ఎలాంటి మార్పునూ అంగీకరించం. రెండోది కేంద్ర కేబినేట్ వెంటనే తెలంగాణపై తీర్మానం చేసి పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టాలి. చివరగా తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రకటన అమలు అయ్యే వరకు ఎలాంటి సన్మానాలు, విజయోత్సవాలను నిర్వహించుకోవద్దు. సీమాంధ్ర నాయకులు చేస్తున్న తప్పుడు ప్రచారాలు, కుట్రలు తిపికొట్టాలి. సీమాంధ్ర నాయకులు విభజనకు సహకరించి సోదరభావంతో విడిపోయి అందరూ కలిసి ఉండాలని ఈ సందర్భంగా సీమాంధ్ర ప్రజలకు విజ్ఞప్తి చేయనున్నారు.
రేపు ప్రొఫెసర్ కోదండరామ్ రాక...
ముల్కీ అమరుల వారోత్సవాల సందర్భంగా ఆదివారం నుంచి గ్రేటర్ హైదరాబాద్లో శాంతి ర్యాలీని ప్రారంభించనున్నారు. 2న జిల్లా కేంద్రంలో నిర్వహించే భారీ శాంతి ర్యాలీకి రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్తోపాటు పలువురు తెలంగాణవాదులు హాజరుకానున్నారు. 3న నిజామాబాద్, 4న కరీంనగర్, 5న వరంగల్, 6న మహబూబ్నగర్ , 7న హైదరాబాద్లో శాంతి ర్యాలీలు నిర్వహించనున్నారు. 7న హైదరాబాద్లో జరిగే ర్యాలీ సిటీ కాలేజ్ నుంచి ప్రారంభమై బేగంబజార్, నాంపల్లి, సెక్రటేరియట్, గన్పార్క్ మీదుగా ఇందిరాపార్కుకు చేరుతుందని జేఏసీ వర్గాలు తెలిపాయి. ఇదిలా ఉండగా కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుపై సానుకూలంగా స్పందించినా ఇటీవల సీమాంధ్ర మంత్రులు, నేతలు అడ్డుకునేందుకు ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణవాదులు తమ వాణిని గట్టిగా వినిపించనున్నారు. ఇదే క్రమంలో శుక్రవారం మంచిర్యాలలో నిర్వహించిన ‘లక్ష గళ గర్జన’ విజయవంతమైంది. సోమవారం జిల్లా కేంద్రంలో నిర్వహించే శాంతిర్యాలీని సైతం విజయవంతం చేసేందుకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.
ర్యాలీని విజయవంతం చేయండి..
ముల్కీ అమరుల స్మృత్యార్థం సోమవారం జిల్లా కేంద్రంలో నిర్వహించే శాంతి ర్యాలీని విజయవంతం చేయా తెలంగాణ విద్యావంతుల వేదిక జిల్లా కన్వీనర్, రాజకీయ జేఏసీ కో కన్వీనర్ ఎ.విజయ్కుమార్ కోరారు. 1952 సెప్టెంబర్ 3, 4 తేదీల్లో జరిగిన ముల్కీ ఉద్యమంలో నాన్ ముల్కీలను బయటకు పంపించి ముల్కీలకే ఉద్యోగాలు ఇచ్చారని, ఈ విషయమై ఉద్యమించిన ఆందోళనకారులపై పోలీసులు జరిపిన కాల్పుల్లో పలువురు అమరులయ్యారని అన్నారు. జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టే వారోత్సవాల్లో తెలంగాణ ప్రజలు, యువకులు, విద్యావంతులు, తెలంగాణవాదులు, వివిధ జేఏసీల నేతలు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొనాలని విజయ్కుమార్ పిలుపునిచ్చారు.