కిరణ్ పనైపోయింది | peoples not responding to kiran kumar reddy | Sakshi
Sakshi News home page

కిరణ్ పనైపోయింది

Published Sat, Dec 21 2013 3:14 AM | Last Updated on Mon, Jul 29 2019 5:31 PM

peoples  not responding to kiran kumar reddy

కదిరి, న్యూస్‌లైన్ : రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి మాటలకు కాలం చెల్లిందని, ఆయన మాయ మాటలను వినే పరిస్థితిలో జనం లేరని వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా కన్వీనర్ శంకరనారాయణ అన్నారు. విభజన బిల్లు విషయంలో కిరణ్, చంద్రబాబు అవలంభిస్తున్న మోసపూరిత వైఖరిని ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు. కదిరిలో శుక్రవారం నిర్వహించిన వైఎస్‌ఆర్‌సీపీ సమైక్య శంఖారావం సభలో ఆయన మాట్లాడారు. కిరణ్, చంద్రబాబు పరోక్షంగా బిల్లుకు సహకరిస్తున్నారన్నారు. వారు ఎక్కడి నుంచి పోటీ చేసినా చిత్తుగా ఓడించాలని ప్రజలను కోరారు. రాష్ట్ర సమైక్యత కోసం వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తోందన్నారు. మతతత్వ బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి చంద్రబాబు వెంపర్లాడుతున్నారన్నారు. ముస్లిం మైనార్టీలు ఈ విషయాన్ని గ్రహించి టీడీపీకి దూరంగా ఉండాలన్నారు. వైఎస్సార్‌సీపీ అనంతపురం జిల్లా పరిశీలకుడు, కడప మాజీ మేయర్ రవీంద్రనాథ్‌రెడ్డి మాట్లాడుతూ..  ఫ్యాన్ గాలికి  టీడీపీ, కాంగ్రెస్ కొట్టుకు పోవడం ఖాయమని అన్నారు. తెలంగాణపై చివరిబంతి ఇంకా వుందని ముఖ్యమంత్రి సీమాంధ్ర వాసులను ఇప్పటికీ మోసగిస్తున్నారని, ఆయన చెప్పడంతోనే కాంగ్రెస్ అధిష్టానం విభజనపై ముందుకు దూసుకుపోతోందని అన్నారు.
 
 ఏపీఎన్‌జీఓ నాయకుడు అశోక్‌బాబు  సమైక్యాంధ్ర ఉద్యమం ఉధృతం కాకుండా ఓ పథకం ప్రకారం..పరోక్షంగా విభజనకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఉన్నట్లైతే రాష్ట్రానికి ఈ గతి పట్టేదే కాదన్నారు. మహానేత వైఎస్ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలన్నీ ఇప్పుడు సరిగా అమలు కావడం లేదన్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయితే వైఎస్ పథకాలను సక్రమంగా అమలు చేయడంతో పాటు మరెన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తారన్నారు. సమైక్యం కోసం ఉద్యమించిన జగన్‌కు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎవరికి టికెట్ ఇచ్చినా వారిని అధిక మెజార్టీతో గెలిపించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఆ పార్టీ సీజీసీ సభ్యురాలు తోపుదుర్తి కవిత మాట్లాడుతూ.. మహానేత వైఎస్ అన్ని వర్గాలను సమంగా చూశారని, ఆయన హయాంలో సంక్షేమ పథకాలు ప్రతి ఇంటి తలుపు తట్టాయన్నారు.
 
 మళ్లీ రాజన్న రాజ్యం రావాలంటే వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలన్నారు. సీఈసీ సభ్యుడు పైలా నర్సింహయ్య మాట్లాడుతూ.. పార్టీ అభివృద్ధి కోసం అందరూ సమష్టిగా కృషి చేయాలన్నారు. ఈ సభలో కదిరి నియోజకవర్గ సమన్వయకర్త ఎస్‌ఎండీ ఇస్మాయిల్, నేత జక్కల ఆదిశేషు, యువజన విభాగం జిల్లా అధ్యక్షులు వీరంజనేయులు, పుట్టపర్తి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ కడపల మోహన్‌రెడ్డి, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు సోమశే ఖర్‌రెడ్డి, పార్టీ నేతలు చవ్వా రాజశేఖర్‌రెడ్డి, డాక్టర్ నాగేంద్రకుమార్‌రెడ్డి పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement