టీడీపీ నేతల నుంచి రక్షణ కల్పించండి
కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్సింగ్ను కోరిన ఏయూ విద్యార్థులు
సాక్షి, న్యూఢిల్లీ/విశాఖ సిటీ: ఆంధ్రప్రదేశ్లో అధికార తెలుగుదేశం పార్టీ నేతల నుంచి తమకు రక్షణ కల్పించాలని పలువురు ఆంధ్రా యూనివర్సిటీ పరిశోధక విద్యార్థులు కేంద్ర హోం మంత్రి రాజ్నాథ్సింగ్ను ఆశ్రయించారు. యూనివర్సిటీల్లో ఎలాంటి రాజకీయ సమావేశాలు నిర్వహించరాదన్న నిబంధనల మేరకు ఏయూ గ్రౌండ్స్లో టీడీపీ మహానాడు నిర్వహించకుండా ఆదేశాలు జారీ చేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసినందుకు కొంత మంది టీడీపీ నేతలు తనను చంపుతామంటూ బెదిరిస్తున్నారని పరిశోధక విద్యార్థి జానకిరాం ఆరోపించారు.
వీరి నుంచి తమకు రక్షణ కల్పించాల్సిందిగా విద్యార్థులు జానకిరాం, కాంతారావు, పోతల ప్రసాద్ తదితరులు రాజ్నాథ్సింగ్ను ఆదివారం ఢిల్లీలోని ఆయన నివాసంలో కలసి విజ్ఞప్తి చేశారు. ఏపీలో ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిపై దాడులు పెరిగిపోతున్నాయని, సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్న వారిని ఆరెస్టులు చేస్తూ భావ ప్రకటన స్వేచ్ఛను కాలరాస్తున్నారని రాజ్నాథ్కు ఫిర్యాదు చేసినట్టు వారు తెలిపారు.