
పట్టణ పోరుకు రెడీ..
పురపాలక సంఘాల ఎన్నికల నిర్వహణకు వేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. జనగామ, మహబూబాబాద్ మున్సిపాలిటీలతో పాటు భూపాలపల్లి...
- నేడు మునిసిపల్ రిజర్వేషన్ల ఖరారు
- రేపు వార్డుల్లో ఓటర్ల జాబితా ప్రదర్శన
- రెండు మున్సిపాలిటీలు, మూడు నగర పంచాయతీల్లో ఎన్నికలకు ఏర్పాట్లు
- గ్రేటర్లో పోరుపై తొలగని సందిగ్ధత
సాక్షి, హన్మకొండ : పురపాలక సంఘాల ఎన్నికల నిర్వహణకు వేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. జనగామ, మహబూబాబాద్ మున్సిపాలిటీలతో పాటు భూపాలపల్లి, పరకాల, నర్సంపేట నగర పంచాయతీల్లో ఎన్నికల నిర్వహణకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికలకు సంసిద్ధత వ్యక్తం చేయడంతో పాటు... ఆదివారం మునిసిపాలిటీ వార్డులో ఓటర్ల జాబితాను ప్రదర్శించాలని ఆదేశించింది. వార్డుల రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియను కూడా పురపాలక శాఖ వేగంగా పూర్తి చేస్తోంది.
మునిసిపాలిటీలు, నగరపంచాయతీల చైర్మన్ల రిజర్వేషన్లును శనివారం ప్రకటించేందుకు ఏర్పాట్లు చేశారు. అలాగే మునిసిపాలిటీలు,నగర పంచాయతీల్లోని వార్డుల వారీగా ఫొటోలతో కూడిన ఓటర్ల జాబితాను ఆదివారం ఆయా వార్డుల్లో ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. లోక్సభ, శాసనసభ ఎన్నికల తరుణంలో మున్సిపాలిటీ ఎన్నికలను ఇప్పట్లో నిర్వహించలేమని రాష్ట్ర ప్రభుత్వం చేసిన అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చిన నేపథ్యంలో ఎన్నికల నిర్వహణ అనివార్యమైంది.
గ్రేటర్పై అస్పష్టత...
గ్రేటర్ వరంగల్పై అధికారిక ఉత్తర్వులు రాకపోవడం, నగరపాలక సంస్థలో వరంగ ల్ సమీప గ్రామపంచాతీలను విలీనం చేసే విషయంలో నెలకొన్న న్యాయపరమైన అడ్డంకులతో... వరంగల్ నగరపాలక సంస్థ ను ఎన్నికలు నిర్వహించే జాబితాలో పేర్కొనలేదు. వార్డుల పునర్విభజన ప్రక్రియ పూర్తికాకపోవడం, కోర్టుల్లో కేసులు ఉన్నవాటికి ఎన్నికలు జరపడం లేదు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేలోపే ఇవన్నీ పూర్తి చేసే యోచన లో పురపాలక శాఖ ఉందని తెలుస్తోంది. ఇ దీ కుదరకపోతే రెండో దశలో ఎన్నికలు జరిపే ఇతర పురపాలక సంస్థలతో పాటు ఎన్నికలు జరగనున్నట్లు అధికారులు చెబుతున్నారు.