
సాక్షి, అమరావతి బ్యూరో: ఆర్టీసీ కొత్త బాట వైపు అడుగులు వేస్తుంది. ఇప్పటికే అద్దె బస్సులను నడుపుతున్న ఆర్టీసీ ఇక మీదట అద్దె లారీలను నడపాలని యోచిస్తోంది. వీటిని సరుకు రవాణాకు వినియోగించనుంది. ఆర్టీసీ పార్శిల్ సేవల్లో ఇప్పటికే గణనీయమైన ఆదాయాన్ని ఆర్జిస్తోంది. అద్దెకు లారీలను తీసుకుని కార్గో సేవలను విస్త్రతం చేయడం ద్వారా మరింత ఆదాయం ఆర్జించవచ్చని ప్రణాళిక రూపొందించారు. ఇందుకోసం ఒక్కో డిపోకు 10వరకు అద్దె లారీలను నడపాలనే యోచనలో ఉంది.
ప్రస్తుత లాక్డౌన్ సమయంలో పాసింజర్ బస్సులను సరుకు రవాణాకు వీలుగా మార్చారు. ఇలా విజయవాడ రీజియన్లో మార్చిన 80కి పైగా బస్సుల ద్వారా నిత్యావసర సరుకులు, ప్రభుత్వ పాఠ్యపుస్తకాలు, కూరగాయలు వంటివి రవాణా చేస్తున్నారు. ఇంకా మార్క్ఫెడ్ ద్వారా మొక్కజొన్నను కూడా తరలిస్తున్నారు.