
శిల్పా మోహన్రెడ్డి సవాల్
టీడీపీ నాయకులకు శిల్పా మోహన్రెడ్డి సవాల్ విసిరారు.
కర్నూలు: నంద్యాలలో గెలవకుంటే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని వైఎస్సార్ సీపీ అభ్యర్థి శిల్పా మోహన్రెడ్డి ప్రకటించారు. టీడీపీ అభ్యర్థి ఓడితే మంత్రి భూమా అఖిలప్రియ రాజీనామా చేస్తారా అని సవాల్ విసిరారు. తన సవాల్ను స్వీకరించే దమ్ము టీడీపీ నాయకులకు ఉందా అని ప్రశ్నించారు.
రాజీనామా విషయంలో తనకు డ్రామాలు తనకు చేతకాదని, అందుకే స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా లేఖ పంపానని మోహన్రెడ్డి సోదరుడు శిల్పా చక్రపాణిరెడ్డి తెలిపారు. శాసనమండలి మండలి చైర్మన్కు రాజీనామా లేఖ పంపినట్టు ఆయన వెల్లడించారు. పార్టీ ఫిరాయించిన 21 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించే దమ్ము టీడీపీకి ఉందా అని ప్రశ్నించారు.
ఎవరెన్ని కుట్రలు చేసినా నంద్యాలలో తమదే గెలుపని విశ్వాసం వ్యక్తం చేశారు. శిల్పా కుటుంబం ఎప్పుడూ శాంతిని కోరుకుంటుందని చెప్పారు. 'దేవుడిచ్చిన దాంట్లో ఎంతోకొంత సమాజానికి మేం తిరిగి ఇస్తున్నాం. ఇన్నేళ్లు మచ్చలేని రాజకీయాలు చేశాం. ఇకపై కూడా నంద్యాల ప్రజలను కన్నబిడ్డల్లా చూసుకుంటామ'ని చక్రపాణిరెడ్డి అన్నారు.