
సాక్షి, అమరావతి: అనంత–అమరావతి ఎక్స్ప్రెస్ హైవే నిర్మాణానికి భూసేకరణను వేగవంతం చేయాలని, వచ్చే ఏడాది మార్చిలోగా టెండర్లు పిలవాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. గురువారం వెలగపూడి సచివాలయంలోని తన కార్యాలయంలో సీఎం రహదారులు, భవనాల శాఖ ప్రాజెక్టులు, పనుల పురోగతిని సమీక్షించారు. ఎక్స్ప్రెస్ వే నిర్మాణానికి అనంతపురం, ప్రకాశం, కర్నూలు, గుంటూరు జిల్లాలో భూసేకరణ త్వరగా పూర్తిచేయాలని టెలీకాన్ఫరెన్స్లో కలెక్టర్లను ఆదేశించారు. వచ్చే కలెక్టర్ల సమావేశం నాటికి కార్యప్రణాళిక రూపొందించి తనకు అందజేయాలని కలెక్టర్లను కోరారు. మార్చి నాటికి కనకదుర్గ ఫ్లై ఓవర్ పూర్తిచేసి తీరాలని అధికారుల్ని ఆదేశించారు. ఈ నెలాఖరులోగా రాష్ట్ర రహదారులు, జిల్లా రహదారులను గుంతలు లేని రహదారులుగా తీర్చిదిద్దాలని కోరారు. హైవేలవద్ద సీసీ కెమేరాలు ఏర్పాటు చేసి గంటకు ఎన్ని వాహనాలు వెళుతున్నాయో గమనించి అందుకనుగుణంగా రోడ్ల సామర్థ్యాన్ని మెరుగుపర్చాలన్నారు. నిర్మాణంలో ఉన్న కత్తిపూడి–కాకినాడ బైపాస్ సహా రాష్ట్రంలోని పలు రహదారి పనుల పురోగతిని సీఎం సమీక్షించారు. దివిసీమకు కృష్ణానది కరకట్ట రోడ్డును పర్యాటకాభివృద్ధికి అనుగుణంగా అభివృద్ధి చేయాలని ఆదేశించారు. ట్రాఫిక్ రద్దీకనుగుణంగా రోడ్ల మరమ్మతులు, వెడల్పుకు రూ.855 కోట్ల విలువైన ప్రతిపాదనలతో రూపొందించిన కార్యప్రణాళికను రహదారులు, భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నీరభ్కుమార్ ప్రసాద్ సీఎంకు వివరించారు. తిత్లీ తుపాను బాధితులకు రూ.7 లక్షల విరాళం ప్రకటించిన రోడ్లు, భవనాల శాఖ ఉద్యోగులు మంత్రి అయ్యన్నపాత్రుడు చేతులమీదుగా చంద్రబాబుకు చెక్ అందించారు.
జమ్మూకశ్మీర్ అసెంబ్లీ రద్దు అప్రజాస్వామికం: సీఎం
జమ్ముకశ్మీర్ అసెంబ్లీని అర్ధాంతరంగా రద్దు చేయడాన్ని ఖండిస్తున్నట్లు సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. గడువు తీరకముందే శాసనసభను రద్దు చేయడం అప్రజాస్వామికమని, కేంద్రంలో మోదీ ప్రభుత్వ రాజ్యాంగ వ్యతిరేక చర్యలకు పరాకాష్ట అని గురువారం ఒక ప్రకటనలో ఆయన ధ్వజమెత్తారు. బీజేపీ నిరంకుశ పెత్తందారీ పోకడలకు ఇది అద్దం పడుతోందని, దీన్ని దేశం మొత్తం ముక్తకంఠంతో ఖండించాలన్నారు.