
కోడి పందేలకు అనుమతి లేదు
- హైకోర్టుకు నివేదించిన ఏపీ ప్రభుత్వం
సాక్షి, హైదరాబాద్: ఏపీలో కోడి పందేల నిర్వహణకు ఎవరికీ అనుమతి లేదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సోమవారం హైకోర్టుకు నివేదించింది. ఒకవేళ ఎవరైనా నిబంధనలను ఉల్లంఘించి కోడి పందేలను నిర్వహించినా, జూదమాడినా తగిన చర్యలు తీసుకోవాలని ఇప్పటికే ఎస్పీలకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపింది.
ఈ వివరాలను నమోదు చేసుకున్న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కళ్యాణ్జ్యోతి సేన్గుపా నేతృత్వంలోని ధర్మాసనం కోడి పందేలపై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని మూసివేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ పిల్ను పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన నరహరి జగదీష్కుమార్ గతవారం హైకోర్టులో దాఖలు చేశారు. దీనిపై ప్రభుత్వ న్యాయవాది ఇచ్చిన వివరణపై సంతృప్తి వ్యక్తం చేసిన ధర్మాసనం ఈ వ్యాజ్యాన్ని పరిష్కరిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది.