
తక్షణమే మాధవ్ వీఆర్ఎస్ను ఆమోదించాలని ట్రిబ్యునల్.. ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది.
సాక్షి, అమరావతి : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హిందూపురం ఎంపీ అభ్యర్థిగా బరిలో దిగనున్న మాజీ పోలీసు అధికారి గోరంట్ల మాధవ్ నామినేషన్ను అడ్డుకోవాలని ప్రయత్నించిన టీడీపీ ఆశలపై ట్రిబ్యునల్ నీళ్లు చల్లింది. తక్షణమే మాధవ్ వీఆర్ఎస్ను ఆమోదించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. రాజకీయ కారణాలతో వీఆర్ఎస్ను నిలిపివేయడం సరికాదని ట్రిబ్యునల్ అభిప్రాయపడింది. దీంతో ఆయన నామినేషన్ వేసేందుకు లైన్ క్లియర్ అయింది. ఈ క్రమంలో ఆయన నామినేషన్ దాఖలు చేసేందుకు అవకాశం లభించింది.
కాగా బీసీలకు పెద్దపీట వేసేందుకు వైఎస్సార్ సీపీ ఏడు లోక్సభ స్థానాలు వారికి కేటాయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పోలీసు అధికారిగా పనిచేసిన గోరంట్ల మాధవ్ ఎంపీ అభ్యర్థిగా అవకాశం దక్కించుకున్నారు. రాజకీయాల్లో చేరే క్రమంలో రెండు నెలల క్రితమే ఆయన వీఆర్ఎస్కు దరఖాస్తు చేసుకున్నారు. కానీ ఏపీ ప్రభుత్వం ఆయన అభ్యర్థనను ఆమోదించకుండా పక్కనబెట్టింది. దీంతో ఆయన నామినేషన్పై గందరగోళం నెలకొన్న సంగతి తెలిసిందే.