చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయానికి వచ్చే భక్తులు స్వామి, అమ్మవారి దర్శనానంతరం వెలుపలికి వెళ్లేందుకు శ్రీకృష్ణదేవరాయల కాలంనాటి సొరంగాన్ని వాడుకలోకి తీసుకురావాలని అధికారులు, ఆలయ సభ్యులు ప్రయత్నిస్తున్నారు.
- శ్రీకాళహస్తి బ్రహ్మోత్సవాల్లో సౌకర్యం కోసం పరిశీలన
- తలుపులు తెరచిన అధికారులు, ఆలయ సభ్యులు
- ఆగమశాస్త్ర విరుద్ధమని అంటున్న నిపుణులు
శ్రీకాళహస్తి : చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయానికి వచ్చే భక్తులు స్వామి, అమ్మవారి దర్శనానంతరం వెలుపలికి వెళ్లేందుకు శ్రీకృష్ణదేవరాయల కాలంనాటి సొరంగాన్ని వాడుకలోకి తీసుకురావాలని అధికారులు, ఆలయ సభ్యులు ప్రయత్నిస్తున్నారు. ఈ మేరకు శనివారం ఆలయ ఈవో భ్రమరాంబ, ఈఈ వెంకటనారాయుణ, సభ్యులు వెంకట్రామానాయుడు, గుర్రప్పశెట్టి, మల్లెమాల ప్రమీలమ్మ, కండ్రిగ ఉమ, తహశీల్దార్ చంద్రమోహన్, డీఎస్పీ వెంకటకిషోర్ సమక్షంలో సొరంగం తలుపులు తెరిచారు.
50 అడుగుల దూరం ఉన్న సొరంగంలో ఆభరణాలు ఉంటాయనే ఉద్దేశంతో ఇబ్బందులు తలెత్తకుండా ముందు జాగ్రత్తగా ఈవో అందరికీ సమాచారం ఇచ్చి తలుపులు తీయించారు. అందులో శ్రీకృష్ణదేవరాయల కాలం నాటి పెద్ద పెద్ద పాత్రలు, కొయ్యలు, స్తంభాలు మాత్రమే ఉన్నాయి. ఆలయ పోటు పైభాగం మీదుగా కంచుగడప సమీపంలో సెక్యూరిటీ పాయింట్ వద్దకు సొరంగం కలుస్తోంది. అక్కడ వెలుపలి భాగంలో దారి కోసం ఆలయ గోడలు నాలుగు అడుగులు తొలగించాల్సి వస్తోంది. అయితే ఎక్కడ పడితే అక్కడ ఆలయు గోడలు తొలగించడం ఆగమశాస్త్ర విరుద్ధవుని పలువురు నిపుణులు అంటున్నారు.
బ్రహ్మోత్సవాల్లో భక్తుల రద్దీ నేపథ్యంలో ఆలయ ప్రధాన ద్వారమైన కంచుగడప మీదుగా భక్తులు లోనికి ప్రవేశిస్తే, దర్శనానంతరం అదే దారిలో కాకుండా ఆలయంపై నుంచి వెలుపలికి వెళ్లడానికి మార్గం ఉంది. ప్రతి ఏటా బ్రహ్మోత్సవాలు, జనవరి నెలలో మాత్రమే భక్తుల సౌకర్యం కోసం ఈ దారిని వినియోగిస్తున్నారు. ప్రస్తుతం దాంతోపాటు సొరంగం ద్వారా కూడా భక్తులు బయటకు వెళ్లేలా ఏర్పాట్లు చేస్తే ఎంతో సౌకర్యంగా ఉంటుందని ఆలయు ఈవో భ్రమరాంబ అంటున్నారు.