జిల్లాలో ఖాళీగా ఉన్న 48 వీఆర్వో, 145 వీఆర్ఏ పోస్టుల భర్తీకి 20వ తేదీలోగా నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు జేసీ లక్ష్మీకాంతం తెలిపారు.
నెల్లూరు(కలెక్టరేట్), న్యూస్లైన్: జిల్లాలో ఖాళీగా ఉన్న 48 వీఆర్వో, 145 వీఆర్ఏ పోస్టుల భర్తీకి 20వ తేదీలోగా నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు జేసీ లక్ష్మీకాంతం తెలిపారు. కలెక్టరేట్లోని తనచాంబర్లో శనివారం ఆయన వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. జేసీ మాట్లాడుతూ కొత్తగా ఎంపికైన వీఆర్వో, వీఆర్ఏలకు జనవరి నెలాఖరులోగా అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇవ్వనున్నామన్నారు. పోస్టుల భర్తీ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆయన అధికారులకు సూచించారు.
27న తహశీల్దార్లకు శిక్షణ
జిల్లాలోని తహశీల్దార్లకు ఈనెల 27న శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామని జేసీ లక్ష్మీకాంతం తెలిపారు. ఎఫ్ లైన్ పిటిషన్లు, సబ్ డివిజన్ అంటే ఏమిటి, ఫీల్డ్ మేనేజ్మెంట్ (ఎఫ్ఎంబీ) బుక్స్ ఎలా రీబిల్డింగ్ చేయాలన్న దానిపై శిక్షణ ఉంటుందన్నారు. ఇప్పటికే ఈ ప్రక్రియ జిల్లాలో 83 శాతం పూర్తయిందని మిగిలిన 17 శాతం పూర్తి చేయాల్సి ఉందన్నారు. జిల్లాలో త్వరలో జరగనున్న ఏడో విడత భూపంపిణీకి సంబంధించిన భూసర్వేను పూర్తి చేయాలని తహశీల్దార్లను ఆదేశించారు. సమావేశంలో ఏజేసీ పెంచలరెడ్డి, తహశీల్దార్లు, సర్వేయర్లు పాల్గొన్నారు.
11 మంది వీఆర్ఏలకు పదోన్నతులు
జిల్లాలోని 11 మంది వీఆర్ఏలకు వీఆర్ఓలుగా పదోన్నతి కల్పించనున్నారు. సోమవారం కలెక్టర్ శ్రీకాంత్ వీరికి కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు కలెక్టరేట్ అధికారవర్గాలు పేర్కొన్నాయి.