సైసై.. నైనై | West Godavari Police Angry on Hen Fights | Sakshi
Sakshi News home page

సైసై.. నైనై

Jan 9 2019 7:15 AM | Updated on Jan 9 2019 7:15 AM

West Godavari Police Angry on Hen Fights - Sakshi

ఢీకొంటున్న పందెం కోళ్లు (ఫైల్‌)

జంగారెడ్డిగూడెం: ఒక పక్క కోడిపందేలు, పేకాటకు పోలీసులు ‘నై’ అంటున్నా.. పందెగాళ్లు మాత్రం ‘సై’ అంటూ ఎవరి ఏర్పాట్లు వారు చేసుకుంటున్నారు. ఏటా సంక్రాంతి సీజన్‌లో పండ గకు ముందు కోడిపందేలు, జూదాలపై పోలీసులు దాడులు నిర్వహించడం, పండగకు నిర్వహిస్తే ఉక్కుపాదం మోపుతామని ప్రకటించడం, ఆ తర్వాత చూసీచూడనట్టు వదిలేయడం తెలిసిందే. ఇటీవల జిల్లా కలెక్టర్‌ కాటంనేని భాస్కర్‌ కోడిపందేలు, జూదాల నిర్వహణపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటించడం, జిల్లా ఎస్పీ ఎం.రవిప్రకాష్‌ పోలీసులను ఆదేశించిన నేపథ్యంలో రెవె న్యూ, పోలీసు యంత్రాంగం ఈ విషయంలో సీరియస్‌గానే ఉన్నారు.

ఎవరి ఏర్పాట్లలో వారు..
పండగ మూడు రోజులు కోడిపందేలు నిర్వహిం చేందుకు పందెంగాళ్లు సమాయత్తమయ్యారు. ఎలాగైనా జరిగి తీరుతాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు వారి ఏర్పాట్లలో వారు నిమగ్నమయ్యారు. ప్రధానంగా ఏజెన్సీ, మెట్ట ప్రాం తాల్లో జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపు రం, బైపాస్‌ రోడ్డు జంక్షన్, సుబ్బంపేటలో ఏటా భారీ ఎత్తున కోడిపందేలు జరుగుతున్నాయి. కామవరపుకోట మండలం వెంకటాపురం, కళ్లచెరువుల్లో పెద్దస్థాయిలో నిర్వహిస్తున్నారు. ఉభయగోదావరి జిల్లాలతో పాటు కృష్ణా, ఖమ్మం జిల్లాలు, కర్ణాటక నుంచి పందెగాళ్లు ఇక్కడకు వస్తుం టారు. గతంలో ఈ ప్రాంతంలో జరిగిన కోడిపందేల్లో తెలంగాణకు చెందిన ఒకరు రివాల్వర్‌ను మూడు రౌండ్లు గాల్లోకి పేల్చి పందేలను ప్రారంభించడం అప్పట్లో చర్చనీయాంశం అయ్యింది. భారీ పందేలకు ఒక బరి, మధ్యతరహా పందేలకు ఒక బరి, చిన్నపాటి పందేలకు మరో బరి అన్నట్టుగా ఏర్పాట్లు చేస్తుంటారు. అయితే ఈసారి ఏర్పాట్లు ఎలా ఉంటాయో అని పందెగాళ్లు ఆసక్తిగా చూస్తున్నారు. ఏటా పోలీసులు కోడిపందేలు, జూదాలు జరగనీయమని ప్రకటించడం, ఉక్కుపాదం మోపుతామని చెప్పడం ఆనక పండగ మూడు రోజులు చూసీచూడనట్టు వదిలేయడం షరా మామూలే కాబట్టి ఈ ఏడాది కూడా ఆ మూడురోజులు కోడిపందేలు జరుగుతాయని జనం ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ఏజెన్సీలో మోస్తరుగా..
పశ్చిమ ఏజెన్సీ మండలాల్లో చాలా చోట్ల మోస్తరుగా కోడిపందేలు నిర్వహిస్తారు. బుట్టాయగూడెం మండలంలో యర్రాయగూడెం, వెలుతురువారిగూడెం, మర్రిగూడెం, దొరమామిడి, దుద్దుకూరు, అచ్చియపాలెం, కొవ్వాడలో, టి.నరసాపురంలో, జీలుగుమిల్లి మండలంలో కామయ్యపాలెం, ములగలంపల్లి, పాలచర్ల తదితర గ్రామాల్లో, గోపాలపురం మండలం వెంకటాయపాలెం, గుడ్డిగూడెం, హుకుంపేటలో కోడిపందేలు జరుగుతాయి. కొయ్యలగూడెం మండలం రాజవరం, కన్నాపురం, రామానుజపురం తదితర గ్రామాల్లో పందేలు నిర్వహిస్తారు. చింతలపూడి మండలం వెంకటాపురంలో పెద్దెత్తున కోడిపందేలు జరుగుతాయి. సీతానగరం, చింతంపల్లి, తిమ్మిరెడ్డిపల్లి, రేచర్లలో పందేలు జరుగుతాయి. లింగపాలెం మండలం కొణిజర్ల, ములగలంపాడులో భారీ కోడిపందేలు జరుగుతాయి. ఇక జంగారెడ్డిగూడెం మండలంలో లక్కవరం, పేరంపేట, తాడువాయి, పంగిడిగూడెం, గుర్వాయిగూడెం, తిరుమలాపురం, కేతవరం, స్థానిక సుబ్బంపేటలలో ఒక మాదిరి కోడిపందేలు జరుగుతాయి. కోడిపందేలు నిర్వహించే ప్రతి చోటా నిర్వాహకులు ఏర్పాట్లకు సమాయాత్తమవుతుంటే, పోలీసులు ఏం చేస్తారో వేచి చూడాల్సిందే.

ఈసారి ఉత్కంఠ
గతేడాది జరిగిన కోడిపందేలు, జూదాల విషయంలో ఇప్పటికే పోలీసు, రెవెన్యూ అధికారులు నోటీసులు అందుకోవడంతో ఇప్పుడు కోడిపందేలపై ఉత్కంఠ నెలకొంది. ఇదిలా ఉంటే ఆయా పోలీసు స్టేషన్‌ పరిధిలోని కోడిపందేలు నిర్వహించే గ్రా మాల్లో రెవెన్యూ, పోలీసు అధికారులు అవగాహన సదస్సులు, హెచ్చరికలు జారీ చేస్తున్నా పం దెంగాళ్లు ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. మరి కొందరు రహస్య ప్రాంతాలకు వెళ్లి గుట్టుచప్పుడు కాకుండా కోడిపందేల నిర్వహణకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఈ ప్రాంత కోడిపందేల నిర్వాహకులు తెలంగాణ, పొరుగుజిల్లాల పందెగాళ్లతో ఒప్పందాలు కుదుర్చుకుని కోడిపందేలకు భారీ ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement